Acid attack in Delhi: బాలికపై యాసిడ్ దాడి; కంటిచూపు కోల్పోయే ప్రమాదం
Acid attack in Delhi: ఢిల్లీలో 17 ఏళ్ల బాలికపై బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు యాసిడ్ తో దాడి చేశారు. బైక్ పై వచ్చిన ఇద్దరు రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళ్తున్న బాలిక ముఖంపై యాసిడ్ విసిరి, పారిపోయారు.
Acid attack in Delhi: వాయువ్య ఢిల్లీలోని ద్వారక మెట్రో స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు స్కూల్ లో 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలికపై దుండగులు యాసిడ్ పోసి పారిపోయారు.
Acid attack in Delhi: ముఖంపై గాయాలు..
తన చెల్లితో కలిసి ఆ బాలిక బుధవారం ఉదయం 9.30 గంటల సమయంలో రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళ్తుండగా, వేగంగా వచ్చిన బైక్ పై వెనుక కూర్చున్న వ్యక్తి ఆ బాలికపై యాసిడ్ విసిరి పారిపోయారు. యాసిడ్ ముఖంపై పడడంతో ఆ బాలిక బాధతో కేకలు పెడ్తూ పడిపోయింది. స్థానికులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం ఆ బాలికను సఫ్దర్ గంజ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలిక ముఖంపై గాయాలయ్యాయని, ఆమె కళ్లు తెరవలేకపోతోందని, కంటి చూపు కోల్పోయే ప్రమాదముందని వైద్యులు తెలిపారు.
Acid attack in Delhi: సీసీటీవీ ఫుటేజ్…
ఈ దాడి ఘటన అక్కడే ఉన్న ఒక సీసీ టీవీలో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధిత బాలిక ఇచ్చిన సమాచారం మేరకు ఆ దాడికి పాల్పడిన వారిలో ఒకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీల ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. దాడికి కారణమేంటో ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.