Puri Jagannadh: బండ్ల గణేష్కు దిమ్మదిరిగే రిప్లై ఇచ్చిన పూరి జగన్నాథ్
తరచూ ఎవరిపైనో నోరు పారేసుకునే అలవాటున్న బండ్ల గణేష్.. ఈ మధ్య పూరి జగన్నాథ్ గురించి చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడతని కామెంట్స్పై పూరి జగన్నాథ్ స్పందించాడు.
బండ్ల గణేష్.. ఒకప్పుడు టాలీవుడ్లోకి ఓ కమెడియన్గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత నిర్మాతగా ఎదిగిన వ్యక్తి. అయితే అతని మాటతీరు ఎప్పుడూ అంత హుందాగా ఉండదు. మనసులో ఏముందో అది చెప్పేయడం బండ్ల గణేష్కు ఉన్న అలవాటు. ఈ మధ్య పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ నటించిన చోర్ బజార్ మూవీ ఈవెంట్ సందర్భంగా అతడు చేసిన కామెంట్స్ కాస్త వివాదానికి కారణమయ్యాయి.
ఆకాశ్ మూవీ ఈవెంట్లోనే అతని తండ్రి పూరి జగన్నాథ్పై బండ్ల గణేష్ అలాంటి కామెంట్స్ చేయడం చాలా మందికి నచ్చలేదు. ఈ ఈవెంట్కు పూరి రాలేదు. అయితే పూరి భార్య లావణ్య అతని దగ్గర ఏమీ లేని సమయంలోనే పెళ్లి చేసుకున్నదని, కానీ ఇప్పుడు అతని దగ్గర డబ్బు, పేరు వచ్చిన తర్వాత వ్యాంపులు, ర్యాంపులు వచ్చారంటూ బండ్ల గణేష్ అనడం విశేషం.
వ్యాంపు అని అతడు ఎవరిని ఉద్దేశించి అన్నాడో తెలియదు కానీ బండ్ల కామెంట్స్ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా వీటిపై పూరి జగన్నాథ్ తన యూట్యూబ్ ఛానెల్లో స్పందించాడు. నేరుగా బండ్ల గణేష్ పేరును ఇందులో ప్రస్తావించకపోయినా.. అతని కామెంట్స్పైనే స్పందించినట్లుగా తెలుస్తోంది. ఈ వీడియోలో పూరి మాట్లాడుతూ.. "మౌనం గొప్ప వరం. జీవితంలో తక్కువ మాట్లాడి, ఎక్కువ వినేవాళ్లు గొప్ప విజయాలు సాధిస్తారు.
మాట్లాడే సమయంలో ప్రతి ఒక్కరూ కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి మాట్లాడాలి. నోరు జారడం వల్ల, ఆలోచించకుండా మాట్లాడటం వల్ల తన కెరీర్, జీవితం రెండూ పాడవుతాయి" అని పూరి జగన్నాథ్ అన్నాడు. ఇందులో ఎక్కడా బండ్ల గణేష్ పేరును పూరి ప్రస్తావించకపోయినా.. అతడు చేసిన కామెంట్స్కు ఇచ్చిన రిప్లైగానే భావిస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్