Radhe Shyam | కలవని ప్రేమికులుగా ప్రభాస్, పూజాహెగ్డే... ‘రాధేశ్యామ్’ సాంగ్ ప్రోమో రిలీజ్
ప్రభాస్,పూజాహెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్’ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమాలోని ‘ఈ రాతలే’ సాంగ్ ప్రోమోను గురువారం విడుదలచేశారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ నటిస్తోన్న లవ్ స్టోరీ ఇది. ఈ పాటలో ప్రభాస్ కొత్తగా కనిపిస్తున్నారు.
ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ విడుదలకు మరో పదిహేను రోజులు మాత్రమే టైమ్ ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడు పెంచుతోంది. గురువారం ‘ఈ రాతలే సాంగ్ ప్రోమోను విడుదలచేశారు. 23 సెకండ్ల నిడివితో కూడిన ఈ ప్రోమోలో ప్రభాస్, పూజాహెగ్డే కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. ఇటలీ వింటేజ్ బిల్డింగ్స్ మధ్యలో వర్షం లో తడుచుకుంటూ ఫిష్ ఆక్వెరియం పట్టుకొని నడుస్తూ వెళుతున్న పూజాహెగ్డే చూసి తన్మయత్వానికి లోనవుతూ ప్రభాస్ ఈ ప్రోమోలో కనిపించారు. ఇందులో ప్రభాస్ లుక్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ మెలోడీ సాంగ్ ను జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించగా కృష్ణకాంత్ సాహిత్యాన్ని సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన ఈ లిరికల్ సాంగ్కు చక్కటి స్పందన లభిస్తోంది. తాజాగా వీడియో ప్రోమోను రిలీజ్ చేసి ప్రభాస్ అభిమానుల్లో చిత్రబృందం జోష్ ను నింపింది. ఈ సినిమా హిందీ వెర్షన్ కు అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ను అందించబోతున్నారు. తెలుగు వెర్షన్ కు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే చిత్ర యూనిట్ ఆయనతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. వింటేజ్ లవ్స్టోరీతో రూపొందిన ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మార్చి 11న ఈ సినిమా విడుదలకానుంది. సీనియర్ హీరో కృష్ణంరాజు సమర్పకుడిగా వ్యవహరిస్తూనే ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇందులో ప్రభాస్ హస్త సాముద్రికుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా సౌత్ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించగా..అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ హిందీ వెర్షన్ కు మ్యూజిక్ డైరెక్టర్లుగా పనిచేస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
సంబంధిత కథనం