Liger: ఇండియాలో తర్వాత పెద్ద హీరో విజయ్నే.. రాసిపెట్టుకోండి.. పూరీ అదిరే స్పీచ్
విజయ్ దేవరకొండ హీరోగా పూరీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లైగర్. ఈ సినిమా ట్రైలర్ గురువారం నాడు విడుదలైంది. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ అధిరిపోయే స్పీచ్ ఇచ్చాడు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, విలక్షణ దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా లైగర్. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో, హీరోయిన్లు విజయ్, అనన్యా పాండేతో పాటు నిర్మాతలు కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. కరణ్ జోహార్ గురించి ప్రస్తావిస్తూ.. ఆయనకు మన సినిమా పిచ్చి ఏంటో చూపిద్దామని ముంబయి నుంచి ఇక్కడకు తీసుకొచ్చానని తెలిపారు.
"నేను లైగర్ గురించి చెప్పట్లేదు. విజయ్ గురించి చెబుతున్నా. అతడు ఇండియన్ సినిమాలో అతిపెద్ద హీరో అవుతాడు. రాసి పెట్టుకోండి. కరణ్ జోహార్కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయనను ట్రైలర్ చూపించడానికి తీసుకురాలేదు. మిమ్మల్ని(ప్రేక్షకులు) చూపించడానికి తీసుకొచ్చా. మన సినిమా పిచ్చి ఎలా ఉంటుందో చూపిద్దామని తీసుకొచ్చా. నెల రోజులే ఉన్నాయి సినిమా విడుదలకు. ఇలాగే ఉండండి. కుమ్మేద్దాం." అంటూ పూరీ జగన్నాథ్ తనదైన శైలిలో స్పీచ్తో అదరగొట్టారు.
లైగర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న కరణ్ మాట్లాడుతూ.. ఆగస్టు 25 సినిమా చూసేందుకు ప్రతి ఒక్కరూ రావాలని విజ్ఞప్తి చేశారు. "లైగర్ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. మీరందరూ ఆహ్వానితులే. నమస్కారం. మీ అందరికీ నా హృదయపూర్వక ప్రేమాభినందనలు" అని కరణ్ అన్నారు.
ఈ సినిమాలో ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్గా చేస్తోంది. పూరీ కనెక్ట్స్తో పాటు బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజయ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పూరీ జగన్నాథే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
సంబంధిత కథనం