పునీత్ రాజ్కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన అల్లు అర్జున్
దివంగత కన్నడ అగ్ర కథానాయకుడు పునీత్ రాజ్కుమార్కు గురువారం అల్లు అర్జున్ నివాళులు అర్పించాడు. గతేడాది అక్టోబర్లో గుండెపోటుతో పునీత్ రాజ్కుమార్ కన్నుమూసిన విషయం తెలిసిందే.
పునీత్ హఠాన్మరణం కన్నడ చిత్రసీమను షాక్కు గురిచేసింది. పునీత్ అంత్యక్రియలకు టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, వెంకటేష్, ఎన్టీఆర్ హాజరై వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆ సమయంలో బన్నీ ‘పుష్ప’ సినిమా షూటింగ్లో బిజీగా ఉండటంతో పునీత్ అంత్యక్రియలకు హాజరు కాలేకపోయాడు.
వ్యక్తిగతంగా పునీత్ కుటుంబాన్ని కలుస్తానని గతంలో ఓ వేడుకలో చెప్పిన బన్నీ తన మాట నిలుపుకున్నాడు. గురువారం బెంగళూరు వెళ్లిన అతడు.. పునీత్ రాజ్కుమార్ కుటుంబసభ్యులను కలిసి మాట్లాడారు. పునీత్ ఫొటోకు నమస్కరించి నివాళులు అర్పించారు.
పునీత్ భార్యాపిల్లలతో పాటు అతడి సోదరుడు, అగ్ర హీరో శివరాజ్కుమార్ను బన్నీ కలిశాడు. పునీత్తోపాటు అతడి కుటుంబంతో తనకున్న అనుబంధాన్నిగుర్తు చేసుకున్నాడు. పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని బన్నీ కలిసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
తమ్ముడి చిత్రానికి అన్న డబ్బింగ్
పునీత్ రాజ్కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’ మార్చి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. అతడు మరణించే నాటికి సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. కానీ తన పాత్రకు డబ్బింగ్ చెప్పకుండానే పునీత్ కన్నుమూశాడు. సోదరుడి కోసం శివరాజ్ కుమార్ ముందుకొచ్చాడు.
పునీత్ పాత్రకు అతడు డబ్బింగ్ చెప్పాడు. పునీత్ రాజ్కుమార్కు ఘనమైన నివాళిగా ఉండాలనే ఆలోచనతో కన్నడ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మార్చి 17 నుంచి 24 వరకు ‘జేమ్స్’ చిత్రానికి పోటీగా ఏ సినిమాను విడుదల చేయకూడదని నిర్ణయించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి చేతన్ కుమార్ దర్శకత్వం వహించారు.