Acharya | అతిపెద్ద డిజాస్టర్ ఆచార్య.. నష్టం ఎంతంటే?
మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ను దారుణంగా దెబ్బతీసేలా ఉంది ఆచార్య మూవీ. ఈమధ్యకాలంలో ఏ సినిమాకు రానంత నెగటివ్ టాక్ ఈ మూవీకి వచ్చింది.
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిపోయేలా ఉంది ఆచార్య. గత నెల 29న రిలీజైన ఈ సినిమా మెగా ఫ్యాన్స్ను కూడా ఆకట్టుకోలేకపోయింది. డివైడెడ్ టాక్ కాదు కదా.. ఈ సినిమా చూసిన వారిలో మెజార్టీ ఆడియెన్స్ పెదవి విరిచారు. తొలిసారి చిరంజీవి, రామ్చరణ్ కలిసి నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజైనా.. ఆ అంచనాల దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది.
ఆ ప్రభావం సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లపై పడింది. తొలి రోజే అంతంతమాత్రం వసూళ్లు సాధించగా.. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ట్రేడ్ అనలిస్టుల అంచనా ప్రకారం.. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్లలో ఇదీ ఒకటిగా మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు భారీ నష్టాలు తప్పవని వాళ్లు తేల్చేశారు. ఆ లిస్ట్లో ఆచార్యకు రెండోస్థానం దక్కవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇప్పటి వరకూ ఈ లిస్ట్లో రూ.90 కోట్లకుపైగా నష్టంతో రాధేశ్యామ్ తొలి స్థానంలో నిలవగా.. అజ్ఞాతవాసి, స్పైడర్, ఎన్టీఆర్ కథానాయకుడు, సాహో, ఎన్టీఆర్ మహానాయకుడు, బ్రహ్మోత్సవం సినిమాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆచార్య కలెక్షన్లను చూస్తే.. ఈ మూవీకి రూ.80 కోట్ల నష్టాలు తప్పేలా లేవు. ఆ లెక్కన ఈ లిస్ట్లో ఆచార్య రెండోస్థానంలో నిలుస్తుంది.
సినిమా షూటింగ్ ఎంతో ఆలస్యమైంది. రిలీజ్ కూడా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాము కేవలం వడ్డీల రూపంలోనే రూ.50 కోట్లు చెల్లించామని సినిమా ప్రమోషన్లలో భాగంగా చిరంజీవి చెప్పాడు. అటు అమెరికాలోనూ ఈ సినిమా పరిస్థితి దారుణంగానే ఉంది. ఇప్పటికీ మొత్తంగా ఆ సినిమా మిలియన్ డాలర్లు కూడా వసూలు చేయలేకపోయింది.
సంబంధిత కథనం
టాపిక్