Droni by Dhoni | డ్రోనీని లాంచ్ చేసిన ధోనీ.. హెలికాప్టర్ షాట్ గుర్తుకొస్తుందా?!
Dhoni Launches Droni: మహేంద్ర సింగ్ ధోనీ తాజాగా డ్రోనీ పేరుతో ఒక కొత్త ప్రొడక్టును మార్కెట్లో విడుదల చేశాడు. ఈ డ్రోనీ ఏంటి? దాని వివరాలు ఇక్కడ చూడండి.
మహేంద్ర సింగ్ ధోనీ.. భారత క్రికెట్ చరిత్రలో ఒక వెలుగు వెలిగిన స్టార్ క్రికెటర్, జట్టుకు ఎవ్వరూ అందివ్వలేనన్ని చిరస్మరణీయ విజయాలు అందించిన కెప్టెన్ కూల్. రిటైర్మెంట్ తర్వాత కూడా ధోని వివిధ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ నాటౌట్గా నిలుస్తున్నాడు.
ఎం.ఎస్. ధోని తాజాగా 'గరుడ ఏరోస్పేస్' అనే కంపెనీ రూపొందించిన ఒక సరికొత్త 'కెమెరా డ్రోన్' ని లాంచ్ చేశాడు. ఈ కెమెరా డ్రోన్ పేరు కూడా ధోనీ పేరును స్ఫురించేలా డ్రోనీ (Droni) అనే పేరును కలిగి ఉండటం విశేషం.
అధునాతన ఫీచర్లతో పూర్తి స్వదేశి పరిజ్ఞానంతో రూపొందించిన 'మేడ్-ఇన్-ఇండియా కెమెరా డ్రోన్' గా దీనిని చెబుతున్నారు. ధోనీ చేతుల మీదుగా విడుదలైన ఈ డ్రోనీ, క్రికెట్లో ధోనీ ఆడే హెలికాప్టర్ షాట్లా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుందా? అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Droni Features and Details- అసలు ఏంటి ఈ డ్రోనీ?
Garuda Aerospace అనే కంపెనీ వివిధ అవసరాల కోసం డ్రోన్లు తయారు చేయటంలో ప్రసిద్ధి. ఈ కంపెనీ సెక్యూరిటీ అవసరాల కోసం అలాగే మ్యాపింగ్, సర్వేయింగ్, పబ్లిక్ అనౌన్స్మెంట్లు, వ్యవసాయ పురుగుమందుల స్ప్రేయింగ్, సోలార్ ప్యానెల్ క్లీనింగ్, ఇండస్ట్రియల్ పైప్లైన్ తనిఖీలు, డెలివరీ సేవలు మొదలైన వాటికోసం డ్రోన్ సొల్యూషన్లను అందిస్తుంది. ఈ గరుడ ఏరోస్పేస్ కంపెనీకి మహేంద్ర సింగ్ ధోనీ బ్రాండ్ ఆంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు. అలాగే కంపెనీలో పెట్టుబడులు కూడా పెట్టినట్లు నివేదికలు వెల్లడించాయి.
ఇక, Dhoni లాంచ్ చేసిన కెమెరా డ్రోన్ Droni విషయానికి వస్తే, దీని గురించి కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు, దీని ధరను కూడా ప్రకటించలేదు. ఈ కొత్త డ్రోన్ క్వాడ్కాప్టర్ డిజైన్ను కలిగి ఉంది. ఇది నిఘా అవసరాల కోసం ఉపయోగపడుతుంది. 2022 చివరి నాటికి ఇది మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానుంది.
అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన డ్రోనీని వివిధ నిఘా ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. తమ డ్రోన్లు అత్యుత్తమ నాణ్యత, అత్యంత సురక్షితమైన ఫీచర్లను కలిగి ఉంటాయని గరుడ ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు, సీఈఓ అగ్నిశ్వర్ జయప్రకాష్ తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ కోసం పాటుపడటమే కాకుండా ఈ రంగంలో భారతదేశాన్ని ప్రపంచానికే ప్రధాన కేంద్రంగా ఉంచాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
సంబంధిత కథనం