Tirumala Darshanam : 12 నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ….
Tirumala Darshanam తిరుమలలో వైకుంఠ ద్వరా దర్శన గడువు ముగియనుండటంతో టైమ్ స్లాటెడ్ దర్శనాలకు టోకెన్లు జారీచ చేయడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. 12వ తేదీ ఉదయం నుంచి నిర్దేశిత సమయంలో స్వామి వారి దర్శనం చేసుకునేలా టైమ్ స్లాటెడ్ దర్శనం టోకెన్లను అందుబాటులో ఉంచనున్నారు.
Tirumala Darshanam సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకు టైమ్ స్లాట్లో దర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. తిరుమల శ్రీవారి భక్తులకు ఈనెల 12 నుంచి సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్లు అందుబాటులో ఉంటాయని తితిదే ప్రకటించింది. గతంలో మాదిరిగానే తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీగోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసంలో ఏ రోజు దర్శనాలకు అదే రోజు టోకెన్లను విడుదల చేయనున్నారు. స్వామి వారి దర్శనానికి సంబంధించి నిర్ణీత సమయంలో క్యూలైన్లలోకి వెళ్లేలా టోకెన్లను జారీ చేయనున్నారు. ఈ నెల 2న ప్రారంభించి, 11వ తేదీ వరకు కల్పిస్తున్న వైకుంఠ ద్వార దర్శనం కోసం జారీ చేస్తున్న టోకెన్లు ఆదివారం ఉదయం 10 గంటలకు పూర్తయ్యాయి. దీంతో టైమ్ స్లాట్ దర్శన టోకెన్లను 12వ తేదీ నుంచి భక్తులకు అందుబాటులో ఉంటాయని టీటీడీ ప్రకటించింది.
TTD Calenders క్యాలెండర్ల విక్రయాలు పూర్తి….
టీటీడీ రూపొందించిన 12 పేజీల తితిదే క్యాలెండర్ల అమ్మకాలు పూర్తైనట్లు టీటీడీ ప్రకటించింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా గత సెప్టెంబరులో తితిదే విడుదల చేసిన 2023వ సంవత్సరానికి సంబంధించిన 12 పేజీల క్యాలెండర్ల అమ్మకాలు పూర్తిగా జరిగాయని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. 12 పేజీల క్యాలెండర్లను 13 లక్షలు ముద్రించి సెప్టెంబరు 27 నుంచి అందుబాటులోకి తెచ్చింది. వీటిని భక్తులు పూర్తిగా కొనుగోలు చేశారు. టీటీడీ క్యాలెండర్లకు భారీగా డిమాండు ఉండటంతో ఈ క్యాలెండర్ల విక్రయాలు జనవరి ఒకటి నాటికే పూర్తైనట్లు టీటీడీప్రకటించింది.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్న ప్రసాద వితరణకు దాతలు సహకరించాలని టీటీడీ పిలుపునిచ్చింది. ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు ఒకరోజు విరాళ పథకం కింద రూ.33 లక్షలు అందించే వారి పేర్లను అన్న దానం భవనంలో ప్రకటిస్తామని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. ఉదయం అల్పాహారం కోసం రూ.7.70 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ.12.65 లక్షలు, రాత్రి భోజనానికి రూ.12.65 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించవచ్చని పేర్కొంది. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో ప్రదర్శిస్తామని టీటీడీ తెలిపింది.
జనవరి 16న గోదా పరిణయోత్సవం
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 14న భోగితేరు, జనవరి 15న మకరసంక్రాంతి జరుగనున్నాయి. జనవరి 14న భోగి పండుగ రోజున సాయంత్రం శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణ స్వామివారిని భోగి తేరుపై కొలువుదీర్చి ఊరేగింపు నిర్వహిస్తారు. జనవరి 15న మకర సంక్రాంతి సందర్భంగా ఉదయం సంక్రాంతి తిరు మంజనం చేపడతారు. బాలాలయం జరుగుతున్న కారణంగా జనవరి 16న కనుమ రోజు నిర్వహించే పార్వేట ఉత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.
జనవరి 16న గోదా పరిణయోత్సవం
గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 16న గోదా పరిణయోత్సవం సందర్భంగా ఉదయం శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి ఆలయం నుండి మేల్ఛాట్ వస్త్రం, పూలమాల ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ ఆండాళ్ అమ్మవారికి సమర్పిస్తారు. సాయంత్రం శ్రీ గోదా పరిణయోత్సవం వేడుకగా నిర్వహిస్తారు.
టాపిక్