Tollywood| సీఎం జగన్తో భేటీ అయిన సినీ ప్రముఖులు.. కీలక అంశాలను చర్చించే అవకాశం
రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్యవహారంపై చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్ నారాయణ మూర్తి, పోసాని కృష్ణ మురళి, అలీ తదితరులు ముఖ్యమంత్రితో బేటీలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్తో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపుకార్యాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్యవహారంపై చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్ నారాయణ మూర్తి, పోసాని కృష్ణ మురళి, అలీ తదితరులు ముఖ్యమంత్రితో బేటీలో పాల్గొన్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్నారు. అనంతపురం రోడ్డు మార్గంలో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసుకు వచ్చారు.
చిత్ర పరిశ్రమకు చెందిన 17 అంశాలను సినీ పెద్దలను జగన్ ముందు పెట్టినట్లు సమాచారం. టికెట్ ధరలు, పరిశ్రమ సమస్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ముఖ్యంగా జీవో నెంబర్ 35లో సవరణలకు సంబంధించిన ప్రతిపాదనలు, సినిమా టికెట్ల పెంపు, ఏసీ, నాన్ ఏసీ థియేటర్లలో కనీస, గరిష్ఠ టికెట్ ధరల పెంపు లాంటి అంశాలను చర్చించనున్నారు. థియేటర్ల వర్గీకరణ, ధరల పెంపుపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయగా.. ఆ కమిటీ ఇప్పటికే నివేదికను అందజేసింది. ఈ అంశంపైనా చర్చించే వీలుంది.
కరోనా కేసుల తగ్గుముఖం పడుతుండటంతో పెద్ద సినిమాల విడుదల సిద్ధమైన తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో చిత్రసీమ సమస్యలకు ఎండ్ కార్డు పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గత కొంతకాలంగా టికెట్ల రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వానికి, చిత్ర సీమకు వివాదం నడుస్తోంది. ఏపీలో సినిమా టికెట్ల తగ్గింపు వల్ల పెద్ద సినిమాలు ఆడవని, ఈ రేట్లతో పెద్దగా లాభం ఉండదని చిత్ర నిర్మాతలు వాదిస్తున్నారు. ఇప్పటికే పలు థియేటర్లు స్వచ్ఛందంగా మూసేస్తే, నిబధనలు పాటించడం లేదని అధికారులే కొన్నింటిని క్లోజ్ చేశారు.