Rock Paintings : శ్రీకాకుళంలో 10 వేల ఏళ్ల కిందటి రాక్ పెయింటింగ్స్
ఏపీలో 10 వేల సంవత్సరాల నాటి రాక్ పెయింటింగ్స్ కనిపించాయి. చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలో 10 వేల ఏళ్ల నాటి రాతి చిత్రాలను ఏపీ పురావస్తు శాఖ కనిపెట్టింది. ఇలాంటివే గతంలో కర్నూలు, మధ్యప్రదేశ్లో కనిపించాయి. పురాతన, చారిత్రక భవనాలుస పురావస్తు అవశేషాల చట్టం, 1960 ప్రకారం వాటి రక్షణ కోసం చర్యలు తీసుకుంటామని.. పురావస్తు శాఖ అధికారి వాణీ మోహన్ చెప్పారు.
పురావస్తు శాఖ సహాయ సంచాలకులు వెంకటరావు మాట్లాడుతూ ఈ చిత్రాలను స్థానికుడు రమణమూర్తి చూసి అధికారులకు సమాచారం ఇచ్చారని చెప్పారు. 'మా బృందం శ్రీకాకుళం పట్టణానికి 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందిగాంలోని కొండతెంబూరు గ్రామంలో అన్వేషణ చేసింది.' అని ఆయన చెప్పారు.
కొండల్లో వెతుకుతుంటే.. రాక్ షెల్టర్లలో పెయింటింగ్లను పురవాస్తుశాఖ కనుగొంది. నిశితంగా పరిశీలిస్తే పెయింటింగ్స్లో నెమలి, పంది, ఖడ్గమృగం, కోతి, మానవుడు, ఏనుగు, పిల్ల ఏనుగు, కుందేలు వంటి జంతువులు.. అంతేకాకుడా పక్షులు ఉన్నాయి.
పెయింటింగ్స్ అక్కడ ఎర్రటి ఓచర్తో గీశారని అధికారులు చెప్పారు. నెమలిని అందంగా చిత్రించారన్నారు. పెయింటింగ్స్, ఇక్కడ దొరికిన చిన్న చిన్న వస్తువులు చూస్తుంటే.. చాలా శతాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో మానవ ఉనికి ఉందని అర్థమవుతోందనిని పురావస్తు శాఖ సహాయ సంచాలకులు వెంకటరావు అన్నారు. జోగుల మెట్ట వద్ద ఉన్న ఆధారాలు చివరి ఎగువ ప్రాచీన శిలాయుగం.. 10000 సంవత్సరాలకు చెందినవి కావొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.
'మా డిపార్ట్మెంట్ ఇంతకుముందు ఇదే మండలంలోని దిమ్మిడి జ్వాలా వద్ద తేనే కొండ సమీపంలో ఇలాంటి పెయింటింగ్లను చూసింది. అక్కడ బల్లి, జింకను రాతిపై గీశారు. రాక్ షెల్టర్ ఫ్లోర్ ముందు.. వివిధ సైజుల్లో నాలుగు కప్పుల గుర్తులు కనిపించాయి. ఇవి చనిపోయినవారికి గుర్తుగా కట్టి ఉంటారు.' అని వెంకటరావు అన్నారు.