September 07 Telugu News Updates : సీపీఎస్ రద్దు సాధ్యం కాదని తేలిందన్న మంత్రి బొత్స
- September 07 Telugu News Updates: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ న్యూస్ లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ కోసం..
Wed, 07 Sep 202205:05 PM IST
జీపీఎస్ ఒప్పుకొనే ప్రసక్తే లేదు
సీపీఎస్పై ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ సమావేశమైంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. సీపీఎస్ కంటే మెరుగైన జీపీఎస్ తెచ్చామని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఓపీఎస్ అమలు చేయాలని జీపీఎస్ ఒప్పుకొనే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాలు నేతలు చెప్పారు.
Wed, 07 Sep 202212:49 PM IST
ఓ న్యూస్ ఛానల్ సిబ్బంది పెన్ డౌన్
ఓ న్యూస్ ఛానల్ సిబ్బంది చేస్తున్న పెన్ డౌన్ సమ్మె పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. పచ్చి అబద్దాల ఛానల్ అని ఆరోపించారు. కుటుంబ పోషణ కోసం పనిచేస్తున్న ఉద్యోగుల పొట్ట కేసీఆర్ పొట్ట కొడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకూ సక్రమంగా జీతాలియ్యడం చేతగాని కేసీఆర్ సొంత ఛానల్ సిబ్బందికి జీతాలియ్యకుండా వేధిస్తావా? అని ప్రశ్నించారు.
Wed, 07 Sep 202211:49 AM IST
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడుతోంది. నగరంలోని మెహిదీపట్నం, గోషామహల్, మంగళ్హాట్, ఆసిఫ్నగర్, జియాగూడ పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, మెహిదీపట్నం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బహదూర్పురా, ఫలక్నుమా, చంద్రాయణగుట్ట, సికింద్రాబాద్, ప్యాట్నీసెంటర్, బేగంపేట, అల్వాల్, చిలకలగూడ, తిరుమలగిరి, బోయిన్పల్లి, మారేడుపల్లిలో ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
Wed, 07 Sep 202210:58 AM IST
బెంగళూరు వరదలు
కర్ణాటకలోని బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా నగరంలో రోడ్లు జలమయమయ్యాయి. ఎటు చూసినా నీరే కనిపిస్తుంది. బెంగళూరులోని చాలా ప్రాంతాలలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. నగరంలోని ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి. ఐటీ కంపెనీలు ఉండే సర్జాపుర, వైట్ఫీల్డ్, మారతహళ్లి ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి.
Wed, 07 Sep 202209:26 AM IST
సిలిండర్లు, పెట్రోల్ బంకుల్లో మోదీ ఫొటో పెడతాం
నిజామాబాద్ జిల్లాలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. దేశానికి ఆర్థిక మంత్రి ఆమె నిజామాబాద్ వచ్చి రేషన్ దుకాణం వెళ్లారని అన్నారు. అక్కడకు వచ్చి కలెక్టర్ తో గొడవగు దిగారని కవిత విమర్శించారు. రేషన్ షాపులో నరేంద్ర మోదీ ఫొటో లేదని అడుగుతున్నారని మండిపడ్డారు. 'ఏ ప్రధాని ఫొటోను రేషన్ దుకాణాల్లో పెట్టలేదు. కానీ నరేంద్ర మోదీ పెట్టాలంట. మీరేం బాధపడకండి. నరేంద్ర మోదీ ఫొటో సిలిండర్లు, పెట్రోల్ బంకుల్లో, యూరియా బస్తాల మీద పెడతాం.' అని కవిత అన్నారు.
Wed, 07 Sep 202207:30 AM IST
హైదరాబాద్ - తిరుపతి స్పెషల్ ట్రైన్స్..
South Central Railway Special Trains Latest: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... తాజాగా మరికొన్నింటిని ప్రకటించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్స్ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.
నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఈ స్పెషల్ రైళ్లు అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్లో తిరుపతి వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని వీటిని ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో హైదరాబాద్-తిరుపతి స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఇవి హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వన్ వే స్పెషల్ ట్రైన్స్ మాత్రమే.
Wed, 07 Sep 202206:02 AM IST
పోలీసులకు నోటీసులు
గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్పై పీడీ చట్టాన్ని వినియోగించి నిర్బంధించడంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
Wed, 07 Sep 202206:01 AM IST
మత్తు ఇస్తుండగా కార్డియాక్ అరెస్ట్…
విరిగిన చేతికి శస్త్రచికిత్స కోసం 8 ఏళ్ల బాలుడికి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మత్తు ఇస్తుండగా.. అనూహ్యంగా మృతి చెందాడు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలానికి చెందిన నీహాన్(8)కు ఈ నెల 4న ప్రమాదంలో కుడి చెయ్యి విరిగింది. అదే రోజు ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు. మంగళవారం బాలుడికి శస్త్రచికిత్స చేయడానికి వైద్యులు ఉదయం 10.30కు ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లారు. అక్కడ మత్తు ఇస్తుండగా బాలుడికి అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ అయిందని గుర్తించి, వెంటనే ఆర్ఐసీయూ వార్డులో చేర్చారు. అక్కడ కృత్రిమ శ్వాస అందించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. మధ్యాహ్నం 1.10 సమయంలో బాలుడు మృతి చెందినట్లు ప్రకటించారు.
Wed, 07 Sep 202205:57 AM IST
ఏపీ కేబినెట్ భేటీ..
సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేబినెట్ ఆమోదించనుంది. అలాగే పలు కీలక అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Wed, 07 Sep 202205:37 AM IST
16న హైదరాబాద్ కు అమిత్ షా
బీజేపీ అగ్రనేత అమిత్ షా మరోసారి తెలంగాణకు రానున్నారు. ఈనెల 16వ తేదీన హైదరాబాద్ లో పర్యటించనున్నారు.
Wed, 07 Sep 202203:44 AM IST
ముందస్తు బెయిల్…
రాజధాని బృహత్ ప్రణాళిక, ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్లో ఆరోపణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్ మంజూరైంది.
Wed, 07 Sep 202203:44 AM IST
ఏపీలో వర్షాలు
Rains in Andhrapradesh: దక్షిణ, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగాను, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే సమయంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే రెండ్రోజులుగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Wed, 07 Sep 202203:08 AM IST
ఏపీ కేబినెట్..
ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది.పలు కీలక అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం.
Wed, 07 Sep 202203:05 AM IST
మంత్రి కన్నుమూత…
కర్ణాటక రాష్ట్ర మంత్రి ఉమేశ్ కత్తి కన్నుమూశారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో గుండె నొప్పి వచ్చింది. ఆయనను వెంటనే బెంగళూరులోని ప్రైవేటు హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ప్రస్తుతం ఆయన కర్ణాటక రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. మంత్రి ఉమేశ్ కత్తి వయసు 61 ఏళ్లు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Wed, 07 Sep 202202:39 AM IST
సీపీఎస్ పై చర్చ
సీపీఎస్పై ఉద్యోగ సంఘాలతో ఇవాళ ప్రభుత్వం చర్చలు జరపనుంది. మంత్రుల కమిటీతో చర్చలకు రావాలని 20 ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ప్రభుత్వం ఆహ్వానం అందించింది. సీపీఎస్ రద్దు అంశంపై చర్చించేందుకు రావాలని ప్రభుత్వం పేర్కొంది. సాయంత్రం నాలుగు గంటలకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది.
Wed, 07 Sep 202202:32 AM IST
భారత్ జోడో యాత్ర
నేటి నుంచి కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ కన్యాకుమారి నుంచి ప్రారంభం కానుంది. సుమారు 3,570 కిలోమీటర్ల మేర 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా సాగే యాత్రకు రాహుల్ గాంధీ నేతృత్వం వహించనున్నారు. యాత్ర ప్రారంభానికి ముందు శ్రీపెరంబుదూర్లో తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారకం వద్ద నివాళులర్పించారు.
Wed, 07 Sep 202201:35 AM IST
గ్రీన్ సిగ్నల్
భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కొవిడ్ నేజల్ వ్యాక్సిన్ (బీబీవీ154)కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) మంగళవారం అత్యవసర వినియోగ అనుమతులను మంజూరు చేసింది. 18 ఏళ్లు పైబడిన వారికి ఈ టీకాను ఇచ్చేందుకు పచ్చజెండా ఊపింది. ముక్కు ద్వారా ఇచ్చే ఈ టీకాకు 4 వేల మంది వాలంటీర్ల మీద క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు భారత్ బయోటెక్ తెలిపింది. వీరెవరిలోనూ ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదని.. నేజల్ వ్యాక్సిన్ సురక్షితమని తేలినట్లు పేర్కొంది.
Wed, 07 Sep 202201:35 AM IST
యునెస్కో జాబితాలో వరంగల్
ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరో ప్రపంచ గుర్తింపు వచ్చింది. గత ఏడాది ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తింపు పొందగా.. తాజాగా సోమవారం వరంగల్ నగరాన్ని గ్లోబల్ నెటవర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీ(జీఎన్ఎల్సీ)గా గుర్తింపు దక్కింది.
Wed, 07 Sep 202201:32 AM IST
‘ఐ–టీడీపీ’ పై సీఐడీ కేసు
టీడీపీ సోషల్ మీడియా విభాగం ‘ఐ–టీడీపీ’పై ఏపీ సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. మార్ఫింగ్ వీడియోల అంశంపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారు. కుట్రపూరితంగా వ్యవహరించడం, దుష్ప్రచారానికి ఒడిగట్టి గౌరవానికి భంగం కలిగించడం, ఫోర్జరీకి పాల్పడిన అభియోగాలపై ఐటీ, ఐపీసీలోని ఫోర్జరీ చట్టాల కింద కేసు నమోదు చేసినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
Wed, 07 Sep 202201:32 AM IST