NCBN in Ponnur : జగన్ అమూల్ బేబీ… వైసీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకమన్న చంద్రబాబు
NCBN in Ponnur ఏపీలో వైసీపీ పాలనలో అరాచకం రాజ్యమేలుతోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా పొన్నూరులో పర్యటించిన చంద్రబాబు ముస్లిం మైనార్టీలతో సమావేశమయ్యారు.
NCBN in Ponnur ఏపీలో ఉచిత ఇసుక విధానం తీసేయ్యడం, విదేశీ విద్య పథకాన్ని రద్దు చేయడం వల్ల తాము ఎలా నష్టపోయిందీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ముస్లింలు వివరించారు. గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు పొన్నూరులో మైనార్టీలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో మంత్రి పదవులకు 10వ తరగతి చదువు అర్హత అవసరం లేదని , సలహాదారులకు 10వ తరగతి అర్హత అవసరం లేదు...దుల్హన్ పథకానికి మాత్రం 10వ తరగతి చదువుకుని ఉండాలని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
ట్యాక్సులతో ఆటోమొబైల్ రంగాన్ని జగన్ సర్కారు సర్వనాశనం చేసిందని ముస్లింలు వాపోయారు. 1983లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే.....1985లోనే ముస్లింలకు మైనారిటీ కార్పొరేషన్ పెట్టిందని చంద్రబాబు గుర్తు చేశారు. ఉర్థూను రెండో అధికారక భాషగా చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశంపార్టీ అని, తాను సిఎంగా ఉండగానే నాడు ఆ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లడం కోసం హైదరాబాద్ లోనే హజ్ హౌస్ కట్టానని చెప్పారు.
హైదరాబాద్ నుంచే యాత్రకు వెళ్లే అవకాశం కల్పించానని, హజ్ యాత్రకు ఆర్థిక సాయం కూడా చేశానని చెప్పారు. హైదరాబాద్ లో ఉర్థూ యూనివర్సిటీ పెట్టానని విభజన తరువాత కర్నూలులో ఉర్థూ యూనివర్సిటీ కట్టానన్నారు.
పండుగల సమయంలో 10 లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ టిడిపి అని సంక్రాంతి సమయంలో సంక్రాంతి కానుక కూడా ముస్లింలకు వర్తింపజేశామన్నారు. తెలుగుదేశం వచ్చిన తరువాతే హైదరాబాద్ లో మత కలహాలు లేకుండా చేశామన్నారు. 2014 తరువాత దుకాన్ మకాన్, దుల్హన్ పథకం తీసుకువచ్చామని, వాటన్నింటిని సిఎం వచ్చిన తరువాత రద్దు చేశాడన్నారు. పెళ్లి కానుక కింద లక్ష ఇస్తాను అని చెప్పి నిలిపివేశాడన్నారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ దుల్హన్ పథకం తీసుకువస్తానన్నారు. జగన్ రెడ్డిలా మోసం చెయ్యనని దుల్హన్ పథకం కింద లక్ష చెల్లిస్తానన్నారు. మైనారిటీ పిల్లల్లో ఉన్నత చదువులు అవసరం అని విదేశీ విద్య పథకం పెట్టానని, విద్యతోనే మార్పు అని గుర్తించి విద్యా రంగానికి ప్రాధాన్యం ఇచ్చానని చెప్పారు. ఐటితో జీవితాలు మారుతాయని ఐటి కంపెనీలను ప్రోత్సహించానని, ముస్లింలకు విదేశీ విద్యతో మంచి అవకాశాలు సృష్టించే ప్రయత్నం చేశానని చెప్పారు. ముస్లింలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం ఇచ్చి అందులో లక్ష సబ్సిడీ ఇచ్చి ముస్లిం వ్యాపారులకు అండగా నిలిచామన్నారు. ఇప్పుడు అన్నీ ఆపేశారని .అడిగితే కేసులు పెడతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నంద్యాలలో అబ్దుల్ సలాంపై తప్పుడు కేసులు పెడితే మదనపడి, భయపడి కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడని, అధికార పార్టీ, పోలీసుల వేధింపుల కారణంగా భార్య పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఒకరి మీద దాడి జరిగిన్పపుడు స్పందించకపోతే ....చివరికి మీపైనా దాడికి వస్తారని హెచ్చరించారు. ప్రభుత్వం నిలిపివేసిన పెన్షన్ లు అన్నీ ఆ కాలానికి కూడా కలిపి టిడిపి ప్రభుత్వం వచ్చిన తరువాత తిరిగి చెల్లిస్తానన్నారు.
జగన్ విధానాలకు, వేధింపులకు పెట్టుబడులు తరలిపోతున్నాయని, కంపెనీలు వెళ్లిపోతున్నాయన్నారు. జగన్ ఒక అమూల్ బేబి, సంగం వద్దు, విజయ డైరీ వద్దు....అమూల్ మాత్రమే ముద్దు అంటున్నాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అన్ని కంపెనీలు తిరిగి తీసుకువస్తాం....యువతకు మన రాష్ట్రంలోనే ఉద్యొగ అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు.
టాపిక్