100 మందితో సూసైడ్ బ్యాచ్.. చావడానికైనా.. చంపడానికైనా రెడీ
ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశ పార్టీ నేత బుద్ధా వెంకన్న బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల సందర్భంగా విజయవాడలో బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. చంద్రబాబు రక్షణ కోసం 100 మందితో సూసైడ్ బ్యాచ్ సిద్ధంగా ఉందన్నారు.
చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు బుధవారం విజయవాడలో జరిగాయి. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వైసీపీ నేతలు తమ నాయకుడు చంద్రబాబు నాయుడిపై దాడులు చేస్తామంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రతిదాడులకు తాము సిద్ధంగా ఉన్నామని వారిని హెచ్చరిస్తున్నానని వెంకన్న వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై చెత్త వాగుడు మానేయాలని సూచించారు. చంద్రబాబు నాయుడు జోలికి కానీ, ఆయన కుటుంబం జోలికి కానీ ఎవరైనా వస్తే.. తనతో పాటు 100 మందితో సూసైడ్ బ్యాచ్ సిద్ధంగా ఉందని, చంద్రబాబును రక్షించుకోవడం కోసం తాము దేనికైనా రెడీ అని, అవసరమైతే చంపడానికైనా.. చావడానికైనా తాము రెడీగా ఉన్నామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంచికి మంచి.. హింసకు హింస తమ సమాధానమని పేర్కొన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు అవసరం చాలా ఉందన్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేసినందువల్లనే జోగి రమేశ్కు మంత్రి పదవి దక్కిందని వైసీపీ ఎమ్మెల్యేలే తనకు చెప్పారన్నారు.
చంద్రబాబు నైజం అది
వెంకన్న వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వస్తున్నాయి. బుద్ధా వెంకన్న వ్యాఖ్యలపై వైసీపీ నేత, మంత్రి జోగి రమేశ్ స్పందించారు. ఇలా సూసైడ్ బ్యాచ్లను సిద్ధం చేసుకునే, ముఖ్యమంత్రిని బూతులు తిట్టించే చెడ్డ నైజం చంద్రబాబుదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని ఎప్పుడో గుర్తించారన్నారు. చంద్రబాబు నాయుడు తనపైనే దాడి చేయించారని గుర్తు చేశారు.
టాపిక్