PRC Issue| ప్రభుత్వంతో చర్చలు విఫలం.. పోరాటం తప్పదు.. ఉద్యోగ సంఘాల అసహనం
అమరావతి వేదికగా సచివాలయంలో రెండు గంటలకు పైగా సాగిన పీఆర్సీ చర్చల్లో ఉద్యోగ సంఘాలకు రిక్త హస్తాలే మిగిలాయి. దీంతో వారు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చాయి. ఉద్యోగులు వినిపించిన మూడు డిమాండ్లు సాధ్యపడవని మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది.
పీఆర్సీ అంశంపై ఏపీ మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాలకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అమరావతి వేదికగా సచివాలయంలో రెండు గంటలకు పైగా సాగిన ఈ చర్చల్లో ఉద్యోగ సంఘాలకు రిక్త హస్తాలే మిగిలాయి. దీంతో వారు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చాయి. ముఖ్యంగా జనవరి నెలకు పాత జీతాలే ఇవ్వాలని, కొత్త పీఆర్సీ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని, అశుతోష్ మిశ్రా కమిటీ ఇచ్చిన నివేదికను బయట పెట్టాలనే మూడు ప్రధాన డిమాండ్లను వినిపించారు. వీటిపై స్పష్టత చేస్తేనే చర్చలకు సిద్ధమవుతామని నొక్కిచెప్పారు. అయితే ఈ మూడు డిమాండ్లను తీర్చలేమని మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. దీంతో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతంగా నిర్వహిస్తామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
ఈ నెల 2న పే స్లిబ్స్ దనహం, మూడో తేదీన తలపెట్టిన ఛలో విజయవాడ, 6 అర్ధరాత్రి నుంచి సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. ఈ ఆందోళనలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాసరవావు ఆరోపించారు. తాము కేవలం మూడు డిమాండ్లను మాత్రమే వినిపించామని, మంత్రుల కమిటీ కొంత సమయం తర్వాత అభిప్రాయం చెబుతామని మభ్య పెట్టి తర్వాత మాట మార్చిందని దుయ్యబట్టారు. డిమాండ్లు సాధ్యపడవని ఓ సందేశం రూపంలో పంపించిందని అన్నారు.
ఒత్తిడి పెంచేందుకు రంగంలోకి కలెక్టర్లు..
ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విఫలం చేసేందుకు ప్రభుత్వం రంగంలోకి కలెక్టర్లను దింపిందని బండి శ్రీనివాసరావు అన్నారు. వారిని భయపెట్టి ఉద్యమాన్ని నీరు గార్చేందుకు ప్రయత్నిస్తోందని, కలెక్టర్లు ఉద్యోగులకు ప్రైవేటు క్లాసులు తీసుకోవడం మానుకోవాలని సూచించారు.
పిలిచి అవమానించారు..
ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచి అవమానించారని ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను బయటపెట్టాలని కోరితే అది ముగిసిపోయిన అధ్యాయమని చెబుతోందని ఆరోపించారు. జీతాలు పెరిగాయని పే స్లిప్పులు పెడితే ఉద్యోగుల్లో ఆందోళన తగ్గిపోతుందని ప్రభుత్వం భావిస్తోందని, వాట్సాప్ సందశాలను పక్కన పెట్టి ఫిబ్రవరి 3న ఛలో విజయవాడకు తరలిరావాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
సంబంధిత కథనం