PDF MLC Candidates : మండలి ఎన్నికల బరిలో పిడిఎఫ్ అభ్యర్థులు
PDF MLC Candidates వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల్ని పిడిఎఫ్ ప్రకటించింది. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లను ఖరారు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ దఫా ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
PDF MLC Candidates వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని పిడిఎఫ్ ప్రకటించింది. 2020లో శాసనసభలో ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులు నెగ్గకుండా అడ్డుకున్నందుకు మండలిని రద్దు చేస్తామని బెదిరించారని ఆరోపించారు. మండలిని రద్దు చేసిన పిడిఎఫ్ ప్రజాక్షేత్రంలో పోరాటాలు కొనసాగిస్తుందని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చినెలల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో యూటీఎఫ్ మద్దతుతో పిడిఎప్ అభ్యర్ధులు బరిలో దిగుతున్నట్లు విజయవాడలో ప్రకటించారు.
ట్రెండింగ్ వార్తలు
సామాజిక ఉద్యమాల్లో ఉంటూ, మచ్చలేని చరిత్ర ఉన్న వారిని ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ అభ్యర్ధులుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దింపుతున్నట్లు ప్రకటించారు. రాజ్యాంగ హక్కులు కాపాడటానికి, నిర్బంధాలకు వ్యతిరేకంగా పోరాడటానికి పిడిఎఫ్ ఎమ్మెల్సీల సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. సీపీఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీం తీసుకురావాలా లేకుంటే గ్యారంటీ పెన్షన్ స్కీంను అమోదించాలా అనే దానిపై ఎమ్మెల్సీ ఎన్నికలు రిఫరెండంగా నిలుస్తాయని చెప్పారు. వచ్చే ఏడాది జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ తర్వాతి ఏడాది జరిగే సాధారణ ఎన్నికలలో ఉద్యోగుల సీపీఎస్ వ్యవహారం కీలకంగా ఉంటుందని చెబుతున్నారు.
వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా ప్రకాశం జిల్లాకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు మీగడ వెంకటేశ్వర రెడ్డి పేరు ఖరారైంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనను బరిలోకి నిలపాలని యూటీఎఫ్ ప్రతిపాదించగా, ఎస్టీయూతో పాటు వివిధ సంఘాలు మద్దతు తెలిపాయి. ఉమ్మడి ప్రకాశం , నెల్లూరు, చిత్తూరు జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బాబురెడ్డి, ఉమ్మడి కడప, కర్నూలు అనంతపురం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా కత్తి నర్సింహారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోతుల నాగరాజు, ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా కె.రమాప్రభ పేర్లను ఖరారు చేశారు. మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ, టీడీపీలు ఇప్పటికే పేర్లను ఖరారు చేశాయి.
టాపిక్