Visakhapatnam Rushikonda Hills: విశాఖ రుషికొండ తవ్వకాలపై ఎన్టీటీలో విచారణ జరిగింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తవ్వకాలు జరపరాదని బెంచ్ ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు జరిగిన తవ్వకాలపై అధ్యయనానికి జాయింట్ కమిటీని నియమించింది. ఇందుకు ఏపీ కోస్టల్ మేనేజ్మెంట్ అథారిటీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని స్పష్టం చేసింది. నెల రోజుల్లో కమిటీ నివేదిక అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.,రుషికొండ వద్ద ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రాజెక్టు పనులపై జాతీయ హరిత ట్రైబ్యునల్ గతేడాదే స్పందించింది. అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకునేందుకు కమిటీ ఏర్పాటుకూ ఆదేశించింది. ఈ క్రమంలో రుషికొండను పూర్తిగా తొలచి వేస్తున్న దృశ్యాలు ఇటీవలి కాలంలో విసృత్తంగా ప్రచారం అయ్యాయి. వీటి ఆధారంగా రుషికొండ ప్రాంతంలో పర్యావరణ ఉల్లంఘన జరుగుతోందని నర్సాపురం ఎంపీ రఘురామ ఫిర్యాదు చేశారు. తవ్వకాల్లో పర్యావరణ అనుమతులు, నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన ఎన్జీటీ.. ఇవాళ స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ,ఈ తవ్వకాల అంశంపై హైకోర్టులోనూ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కూడా విచారణ జరుగుతోంది.