Polavaram Project : పోలవరం నిర్మాణం ఆలశ్యం…. వరదలే కారణమన్న కేంద్రం
Polavaram Project గోదావరికి పోటెత్తిన వరదల కారణంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలశ్యమవుతోందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2020, 2022లో వచ్చిన వరదల వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని, దీని వల్ల 2024 నాటికి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు నిర్మాణం ఆలశ్యమవుతుందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పార్లమెంటులో ప్రకటించారు.
Polavaram Project ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలశ్యమవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వరుస వరదల కారణంగా నిర్మాణం మరింత ఆలశ్యం అవుతుందని స్పష్టం చేసింది. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుపై పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టును మార్చి 2024 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా వరదల వల్ల ఆలశ్యం అవుతుందని కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు ప్రకటించారు.
ట్రెండింగ్ వార్తలు
పోలవరం ప్రాజెక్టులో మొత్తం 78.99శాతం నిర్మాణం పూర్తైందని, ఏప్రిల్ 2014 నుంచి డిసెంబర్ 2022 వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై రూ.16,035.88కోట్ల రుపాయలు ఖర్చు చేసినట్లు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కేటాయించిన మొత్తాన్ని మినహాయిస్తే ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు కోసం రూ.13,226.04కోట్ల రుపాయలు కేంద్రం విడుదల చేసినట్లు వివరించారు. రూ.2,390.27కోట్ల రుపాయలకు పిపిఏ అమోదం లభించలేదని, రూ.548.38కోట్ల రుపాయల బిల్లులను పిపిఏ పరిశీలిస్తున్నట్లు ప్రకటించారు.
జూన్ 2024 కల్లా డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినా, గోదావరి నదికి ఇటీవల వచ్చిన వరదల కారణంగా కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని, తెలుగు దేశం పార్టీ ఎంపీ కనపకమేడల పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
'తాజాగా షెడ్యూల్ గడువు ప్రకారం పోలవరం ప్రాజెక్టు 2024 మార్చి నాటికి, పోలవరం ప్రాజెక్టు పంపిణీ వ్యవస్థ 2024 జూన్ నాటికి పూర్తికావాల్సి ఉందని, 2020, 2022ల్లో గోదావరి నదికి వచ్చిన భారీ వరదల దృష్ట్యా ప్రతిపాదిత షెడ్యూల్లో కొంత జాప్యం జరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటి వరకు రూ.13,226 కోట్లు చెల్లించామని, రూ.2,390 కోట్ల నిధులకు తిరిగి చెల్లించే అర్హత లేదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ గుర్తించిందని స్పష్టం చేశారు.
ఈ ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలంలో ఖర్చుల తిరిగి చెల్లింపు అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించే బిల్లులు, పీపీఏ, కేంద్ర జలసంఘం వాటిని పరిశీలించి చేసే సిఫార్సులపై ఆధారపడి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ప్రాజెక్టులో స్పిల్వే, ఎగువ కాఫర్ డ్యాం, కాంక్రీట్ డ్యాం (గ్యాప్-3), ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ డయాఫ్రం వాల్ (గ్యాప్-1) నిర్మాణం పూర్తయ్యాయి. ఎర్త్ కం రాక్ఫిల్ డ్యామ్ (గ్యాప్ 1, 2) నిర్మాణం, నిర్వాసిత కుటుంబాలకు సహాయ పునరావాస కల్పన వివిధ దశల్లో ఉందని మంత్రి వివరించారు.
జలవిద్యుత్తు ప్రాజెక్టుకుకి నిధులివ్వం…
పోలవరం జల విద్యుత్తు ప్రాజెక్టును ఏపీ జెన్కో నిర్మిస్తోందని, 2016-17 నాటి ధరల ప్రకారం దీనికి రూ.5,338.95 కోట్లు ఖర్చవుతుందని ఆ సంస్థ తెలిపిందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి గ్రాంటూ ఇవ్వదని స్పష్టం చేశారు. రాజ్యసభలో వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
'పోలవరం ప్రాజెక్టులో భాగంగా ఏపీ జెన్కో 960 మెగావాట్ల జలవిద్యుత్తు ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు పునాది కోసం భూమి తవ్వకం పనులు పూర్తయినట్లు జెన్కో తెలిపింది. 2026 జనవరి నాటికి దీని నిర్మాణం పూర్తిచేయాలన్నది లక్ష్యమని మంత్రి తెలిపారు.
టాపిక్