BjpSomuVeerraju : జనసేనతోనే పొత్తు.... తేల్చుకోవాల్సింది టీడీపీనే …సోమువీర్రాజు-bjp journey continues with janasena only says somu veerraju ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Bjp Journey Continues With Janasena Only Says Somu Veerraju

BjpSomuVeerraju : జనసేనతోనే పొత్తు.... తేల్చుకోవాల్సింది టీడీపీనే …సోమువీర్రాజు

HT Telugu Desk HT Telugu
Jun 05, 2022 09:12 AM IST

ఎన్నికల పొత్తుల విషయంలో పవన్‌ కళ్యాణ్‌ ప్రకటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. పవన్ కళ్యాణ్‌ ప్రకటనను స్వాగతించిన సోము, పవన్‌ మూడు ఆప్షన్లలో మొదటి దానిని పరిగణలోకి తీసుకుంటున్నామని ప్రకటించారు. ఆత్మకూరులో టీడీపీ పోటీ చేయకపోవడాన్ని సోము వీర్రాజు తప్పు పట్టారు.

ఏపీలో జనసేనతో కలిసి పనిచేస్తామని బీజేపీ ప్రకటించింది.
ఏపీలో జనసేనతో కలిసి పనిచేస్తామని బీజేపీ ప్రకటించింది. (HT_PRINT)

రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి పవన్ కళ్యాణ్ సూచించిన మూడు ఆప్షన్లలో మొదటి దానికే తాము పరిగణలోకి తీసుకుంటామని సోమువీర్రాజు ప్రకటించారు. పవన్‌ చెప్పిన బీజేపీ, టీడీపీ, జనసేన మైత్రి గురించి తెలుగుదేశం పార్టీయే సమాధానం చెప్పాలని తాము పవన్ ఆప్షన్లలో మొదటి దానికే ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఒంటరిగా పోటీ చేయడమనేది పవన్ కళ్యాణ్‌ చివరి ఆప్షన్‌గా పెట్టుకున్నారు. బీజేపీతో కొనసాగుతున్న మైత్రిని కొనసాగిస్తూ ఆ పార్టీతో కలిసి పోటీ చేయడంతో పాటు, టీడీపీ,బీజేపీ, జనసేనలు కలిసి పోటీ చేయాలని ప్రతిపాదన కూడా పవన్ నోటి నుంచి వచ్చింది. అయితే నిర్ణయాన్ని టీడీపీకే వదిలేశారు. పవన్‌ పెట్టిన కండిషన్లకు, ముఖ్యమంత్రి పదవిని వదులుకోడానికి తెలుగుదేశం పార్టీ ఆసక్తి చూపకపోవచ్చు.

సోమవారం విజయవాడలో బీజేపీ నిర్వహించే సమావేశంలో రాజకీయ పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీజేపీ-జనసేన పొత్తులకు సంబంధించిన కీలకమైన ప్రకటన నడ్డా చేస్తారని వార్తలు కూడా వెలువడ్డాయి.జనసేన తరపున నడ్డా పర్యటనకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్ ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటం వల్ల విజయవాడలో ఉండటం లేదని కూడా వివరణ ఇచ్చారు. కరోనా సోషల్ డిస్టెన్సింగ్ వల్ల బీజేపీ-జనసేన కలిసి ఉమ్మడి కార్యక్రమాలు చేయడం లేదని, త్వరలోనే రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని కూడా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రకటించారు. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆయన ఆలోచనను స్వాగతించారు. 

పవన్ కళ్యాణ్‌ చేసిన మొదటి ప్రతిపాదన తమకు అమోదమని, బీజేపీ-జనసేన కలిసి అడుగులు ముందుకు వేస్తాయని చెప్పారు. ఎవరు మెట్టు ఎక్కుతారో, ఎవరు దిగుతారో త్వరలోనే తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ శూన్యతకు ఆత్మకూరు ఉపఎన్నికతో సమాధానం చెబుతామన్నారు. కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని, వైసీపీ తీరును అంతా తప్పు పడుతున్నారని, అందుకే ఆత్మకూరులో పోటీచేస్తున్నామని చెప్పారు. మరోవైపు టీడీపీ ఆత్మకూరులో పోటీ చేయకపోవడాన్ని సోము వీర్రాజు తప్పు పట్టారు. తిరుపతి ఉపఎన్నికల్లో పోటీ చేసి ఆత్మకూరులో ఎందుకు పోటీ చేయడంలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్కో ఎన్నికకు ఒక్కో విధానం ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికకో విధానం, అసెంబ్లీ ఎన్నికకో విధానం ఎందుకుంటుందన్నారు.

IPL_Entry_Point

టాపిక్