Special Status : ప్రత్యేక హోదాపై ప్రధానికి సీఎం జగన్ విజ్ఞప్తి
అల్లూరి జయంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు. భీమవరం పర్యటన ముగించుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యే సమయంలో ముఖ్యమంత్రి జగన్, ప్రధానికి పలు విజ్ఞప్తులు చేశారు.
విభజన హామీల అమలులో జోక్యం చేసుకోవాలని ప్రధాని జగన్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు, భోగాపురం విమానాశ్రయానికి అనుమతులు, రెవిన్యూ లోటు భర్తీ అంశాలపై ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి వినతి పత్రం సమర్పించారు.
గన్నవరం విమానాశ్రయంలో ప్రధానమంత్రికి వీడ్కోలు పలికే సమయంలో సీఎం వైయస్.జగన్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి విజ్ఞాపన పత్రం అందచేశారు.
ముఖ్యమంత్రికి అందచేసిన వినతి పత్రంలో రాష్ట్ర విభజన కారణంగా ఏర్పడిన రీసోర్సు గ్యాప్ గ్రాంటు అంశాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. దాదాపు రూ.34,125.5 కోట్ల రూపాయలను రీసోర్స్ గ్యాప్ కింద గ్రాంటుగా ఇవ్వాలని కోరారు. తెలంగాణ డిస్కంలనుంచి ఏపీ జెన్కోకు రావాల్సిన రూ.6,627.28 కోట్లను ఇప్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని సీఎం కోరారు.
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రానికి ఇస్తున్న రేషన్ విషయంలో హేతు బద్ధత లేదని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని, రేషన్ కోటా సవరించి రాష్ట్రానికి మేలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రధానిని కోరారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన వైద్యకళాశాలకు తగిన ఆర్థిక సహాయం చేయాలని ముఖ్యమంత్రి కోరారు.
భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించిన అనుమతుల గడువు ముగియడంతో తాజా అనుమతులు మంజూరుచేయాలని ముఖ్యమంత్రి ప్రధానిని కోరారు. విభజన హామీల్లో భాగంగా ఏర్పాటు చేసిన కడప ఉక్కు కర్మాగారం అవసరాల రీత్యా ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. విభజన వల్ల దెబ్బతిన్న రాష్ట్రం కోలుకునేందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
మరోవైపు ప్రధాని రాష్ట్ర పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి భరోసా ఇవ్వకపోవడంపై వామపక్షాలు నిరసన తెలిపాయి. అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు మరోసారి మోడీ,బిజెపిలు ద్రోహం చేశాయని ఆరోపిస్తూ విజయవాడ లెనిన్ సెంటర్లో ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసన తెలుపుతున్న ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక హోదా అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే .రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్. బాబురావు తదితరులను అరెస్టు చేసి భవానిపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు
టాపిక్