AP SDMA Weather Alert బంగాళా ఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం….
AP SDMA Weather Alert బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం నవంబరు 21 నుంచి ప్రభావం మన రాష్ట్రం పైన చూపనుందని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ అంచనా వేస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుందని , మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
AP SDMA Weather Alert నైరుతి , ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుండటంతో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రస్తుతాం శ్రీలంకలోని జాఫ్ణాకు తూర్పున 600 కి.మీ.,తూర్పు ఆగ్నేయంగా కారైకాల్కు 630 కి.మీ దూరంలో, చెన్నైకి 670 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు.
ట్రెండింగ్ వార్తలు
వాయుగుండంగా నెమ్మదిగా కొనసాగుతూ రాగల 48 గంటల్లో తమిళనాడు - దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాయుగుండం ప్రభావంతో రేపు, ఎల్లుండి దక్షిణకోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నాయి.
రాయలసీమలోని చిత్తూరు, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ముందస్తు చర్యల కోసం సంబంధిత జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మత్స్యకారులు మంగళవారం వరకు దక్షిణకోస్తా-తమిళనాడు తీరం వెంబడి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. వర్షాల నేపధ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ శాఖ సూచిస్తోంది.
ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. ఇది రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందన్నారు.
దక్షిణాంధ్ర -తమిళనాడు తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. పిడుగులతో కూడిన వర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టుప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్లుక్రింద నిలబడవద్దని విజ్ఞప్తి చేశారు.
నవంబరు 20న తక్కువగా వర్షాలు కురుస్తాయని, నవంబరు 21 నుంచి 24 మధ్యలో నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. తీర ప్రాంతాలకి దగ్గరగా ఉన్న ప్రాంతాలైన సూళూరుపేట, కృష్ణపట్నం ఇలాంటి భాగాల్లో కాస్త భారీగా వర్షాలుంటాయని నిపుణులు హెచ్చరిస్తన్నారు. అల్పపీడనం బలపడుతూ బలపడుతూ వాయుగుండం, తీవ్ర వాయుగుండంగా మారి మన రాష్ట్రం తీరం వైపుగా రానుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత పొడిగాలుల ప్రభావంతో బలహీనపడుతుందని భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు మధ్య ఆంధ్ర జిల్లాల్లో తక్కువగా వర్షాలుండొచ్చు.