Weather Updates: మండుతున్న భానుడు.. మళ్లీ అధిక ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎండలు మండుతున్నాయి. అసని తుపాన్ పూర్తిగా తగ్గిపోవడంతో.. వాతావరణం పొడిగా మారింది. మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యో అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది.
అసనితో కాస్త చల్లబడిన వాతావరణం మళ్లీ వేడేక్కుతుంది. భానుడు భగభగలతో ఎండలు మండుతున్నాయి. వాతావరణం పూర్తిగా పొడిగా మారిందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక తెలంగాణలో చూస్తే... కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఇక నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఏపీలోనూ ఎండలు మండుతున్నాయి. పలుచోట్ల 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. సీమ జిల్లాల్లో వాతావరణం పొడిగా మారింది. ఇవాళ్టి నుంచి ఇక్కడ కూడా ఎండలు మండిపోనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొది. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో 38 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఎండలు మండుతుండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో అధికంగా నీళ్లు తీసుకోవాలని చెబుతున్నారు. మధ్యాహ్నం వేళ గొడుగులు వాడటం మంచిదని సలహా ఇస్తున్నారు. ఇక డీహెడ్రేషన్కు గురి కాకుండా కొబ్బరి బొండాలు, పళ్ల రసాలు తీసుకోవాలని చెబుతున్నారు.