Shastri on Kohli vs Gambhir: కోహ్లీ ఐకాన్.. గంభీర్తో గొడవపై రవిశాస్త్రీ షాకింగ్ కామెంట్స్
Shastri on Kohli vs Gambhir: కోహ్లీ-గంభీర్ గొడవ గురించి రవిశాస్త్రీ స్పందించారు. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని, సమస్యను ఇంతటితో ముగింపునకు తీసుకురావాలని సూచించారు. కోహ్లీ ఐకాన్ అయితే.. గంభీర్ రెండుసార్లు ప్రపంచ కప్ విన్నర్ అని తెలిపారు.
Shastri on Kohli vs Gambhir: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. 10 ఏళ్ల క్రితం మొదలైన వీరి గొడవ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇటీవలే బెంగళూరు-లక్నో మధ్య జరిగిన మ్యాచ్లో వీరి వైరం మరోసారి బహిర్గతమైంది. ఇద్దరూ ఒకరినొకరు మాటల యుద్ధం చేసుకున్నారు. దీంతో వీరిద్దరిని తప్పుపడుతున్నారు మాజీలు. సునీల్ గవాస్కర్ అయితే ఏకంగా ఇద్దరినీ సస్పెండ్ చేసేయాలని కామెంట్ చేశారు. తాజాగా ఈ విషయంపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రీ స్పందించారు.
"ఈ విషయం ఒకటి రెండు రోజుల్లో ఓ కొలిక్కి వస్తుందని అనుకుంటున్నా. వారిద్దరూ అర్థం చేసుకుని మెరుగ్గా హ్యాండిల్ చేస్తారని అనుకుంటున్నా. ఇద్దరూ ఒకే స్టేట్కు ఆడారు. అంతర్జాతీయ క్రికెట్లో రాణించారు. గౌతమ్ గంభీర్ రెండు సార్లు ప్రపంచ కప్ విన్నర్. విరాట్ కోహ్లీ ఐకాన్. ఇద్దరూ దిల్లీ నుంచే వచ్చారు. కాబట్టి ఇరువురు కూర్చుని చర్చించి సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తానుకుంటున్నా. ఇంతటితో ఈ విషయానికి ఫుల్స్టాప్ పెడతారనుకుంటున్నాను." అని రవిశాస్త్రీ స్పష్టం చేశారు.
సమస్యను పెద్దగా చేయకుండా అక్కడితో కట్ చేసేయాలని రవిశాస్త్రీ అభిప్రాయపడ్డారు. "ఈ అంశాన్ని ముగించడానికి ఎవరు ఎంత త్వరగా మొదలుపెడితే అంత మంచిది. ఎందుకంటే ఇది మళ్లీ కొనసాగడం నాకు ఇష్టం లేదు. మరోసారి కలిసినప్పుడు మాటల యుద్ధం జరిగితే పరిస్థితి ఇంకా దిగజారుతుంది. ఇంకో సమస్యకు కూడా దారి తీస్తుంది. ఎంత త్వరగా అయితే అంత మేలు. నేను చేయాల్సి వస్తే ఇదే చేస్తాను." అని రవిశాస్త్రీ తెలిపారు.
అసలేమైంది..
ఇటీవలే బెంగళూరు-లక్నో మధ్య జరిగిన మ్యాచ్లో ప్రత్యర్థి బ్యాటర్ నవీన్ ఉల్ హఖ్పై కోహ్లీ పదే పదే కామెంట్లు చేశాడు. దీంతో విరాట్పై అమిత్ మిశ్రా ఫీల్డ్ అంపైర్కు కంప్లైట్ చేస్తున్న సమయంలో ఈ గొడవ జరిగింది. లక్నో బ్యాటర్ కైల్ మేయర్స్.. విరాట్ కోహ్లీతో ఏదో మాట్లాడుతున్నప్పుడు గంభీర్ వచ్చేసి కైల్ మేయర్స్ను లాక్కుని వెళ్లాడు. కోహ్లీతో మాట్లాడకుండా అతడిని గంభీర్ తీసుకెళ్లడం పరిస్థితిని తీవ్రతరం చేసింది. ఆ సమయంలో కోహ్లీ ఏదో అనడం, గంభీర్ తిరిగి అతడిపైకి వెళ్లడంతో సంఘర్షణ చోటు చేసుకుంది. మైదానంలో ఈ రకమైన ఉద్రిక్త వాతావరణానికి కారణమైన గంభీర్, కోహ్లీ, నవీన్పై ఐపీఎల్ యాజమానం కోడ్ ఆఫ్ కండక్ట్ తేల్చి వారి మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానాగా విధించింది.