India vs England: దంచికొట్టిన హార్దిక్, విరాట్.. టీమిండియా ఫైటింగ్ స్కోరు
India vs England: హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ఇంగ్లండ్తో జరుగుతున్న సెమీఫైనల్లో ఇండియా ఫైటింగ్ స్కోరు సాధించింది. ఓపెనర్ రాహుల్, సూర్య, కెప్టెన్ రోహిత్ విఫలమైనా.. ఈ ఇద్దరూ టీమ్ను ఆదుకున్నారు.
India vs England: హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లి చెలరేగారు. హాఫ్ సెంచరీలతో టీమిండియాను ఆదుకున్నారు. ఇంగ్లండ్తో జరుగుతున్న సెమీఫైనల్లో ఈ ఇద్దరి జోరుతో ఇండియన్ టీమ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 రన్స్ చేసింది. విరాట్ 39 బాల్స్లో, హార్దిక్ 29 బాల్స్లో హాఫ్ సెంచరీలు చేయడం విశేషం. ఈ ఇద్దరూ నాలుగో వికెట్కు 61 రన్స్ జోడించారు. విరాట్ 50 రన్స్ చేసి ఔటవగా.. హార్దిక్ 33 బాల్స్లోనే 63 రన్స్ చేసి చివరి బాల్కు హిట్ వికెట్గా ఔటయ్యాడు.
ఇన్నింగ్స్ 19వ ఓవర్లో హార్దిక్ విశ్వరూపం చూపించాడు. సామ్ కరన్ వేసిన ఆ ఓవర్లో వరుసగా 4, 6, 4 కొట్టి కేవలం 29 బాల్స్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు రిషబ్ పంత్ కూడా ఒక ఫోర్ కొట్టడంతో ఆ ఓవర్లో మొత్తం 20 పరుగులు వచ్చాయి. దీంతో సామ్ కరన్ 4 ఓవర్లలో 42 పరుగులు సమర్పించుకున్నాడు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (4) మరోసారి నిరాశ పరిచాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ ను చక్కదిద్దడానికి ప్రయత్నించారు. ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 47 పరుగులు జోడించారు. రోహిత్ మంచి టచ్ లో కనిపించినా.. 27 రన్స్ చేసి జోర్డాన్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించి ఔటయ్యాడు.
తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తనదైన స్టైల్లో చెలరేగినట్లే కనిపించాడు. స్టోక్స్ బౌలింగ్ లో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టాడు. అయితే ఆ తర్వాత రషీద్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించి 14 పరుగుల దగ్గరే ఔటయ్యాడు.