Ashwin on Smith: ఆస్ట్రేలియన్లకు ఇలాంటి మైండ్గేమ్స్ కొత్త కాదు.. స్మిత్ కామెంట్స్పై అశ్విన్ కౌంటర్
Ashwin on Smith: ఆస్ట్రేలియన్లకు ఇలాంటి మైండ్గేమ్స్ కొత్త కాదు అంటూ స్టీవ్ స్మిత్ చేసిన కామెంట్స్పై టీమిండియా స్పిన్నర్ అశ్విన్ కౌంటర్ ఇచ్చాడు. ఇండియాలో కావాలనే టూర్ గేమ్ ఆడటం లేదని స్మిత్ చెప్పిన విషయం తెలిసిందే.
Ashwin on Smith: ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ అంటే మైండ్ గేమ్స్.. స్లెడ్జింగ్. ఆటతోపాటు నోటికి పని చెప్పి గెలవడం కంగారూలకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. ఓ సిరీస్ ప్రారంభానికి ముందు ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీయడానికి వాళ్లు ఏవోవో కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆ టీమ్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా ఇండియాలో ఎందుకు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం లేదనడానికి ఓ వింత కారణం చెప్పాడు.
ట్రెండింగ్ వార్తలు
కిందటి సారి తమకు పేస్ పిచ్ పై ప్రాక్టీస్ మ్యాచ్ ఏర్పాటు చేశారని, అసలు మ్యాచ్ లలో ఉండే పిచ్ లకు దీనికి సంబంధం లేకుండా ఉందని, అందుకే తాము ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండా తమ సొంతంగా స్పిన్ పిచ్ లపై ప్రాక్టీస్ చేస్తున్నట్లు స్మిత్ చెప్పాడు. అయితే దీనికి తాజాగా స్పిన్నర్ అశ్విన్ కౌంటర్ ఇచ్చాడు. తన యూట్యూబ్ ఛానెల్లో అతడు మాట్లాడాడు.
"ఆస్ట్రేలియా ఈసారి ఎలాంటి టూర్ మ్యాచ్ లు ఆడటం లేదు. అయితే ఇదేమీ కొత్త కాదు. ఇండియా కూడా కొన్ని విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు టూర్ గేమ్స్ ఆడదు. టీమిండియా అంతర్జాతీయ షెడ్యూల్ చాలా బిజీగా ఉండటం వల్ల ఇలా జరుగుతుంది.
2017లో తొలి టెస్ట్ లో ఎదురైన పిచ్ కు భిన్నంగా బ్రాబౌర్న్ లో ప్రాక్టీస్ మ్యాచ్ కోసం పచ్చిక ఉన్న పిచ్ ఇచ్చారని స్మిత్ అన్నాడు. నిజానికి పుణెలో చాలా టర్న్ ఉన్న పిచ్ అది. వాళ్లకు పచ్చిక ఉన్న పిచ్ ఇచ్చి ఉండొచ్చు. కానీ దానికోసం ఎవరూ ప్రత్యేకంగా ప్లాన్ చేయరు.
అయినా ఓ సిరీస్ కు ముందు ఆస్ట్రేలియాకు ఇలా మైండ్ గేమ్స్ ఆడటం, స్లెడ్జింగ్ చేయడం అలవాటు. వాళ్లు దానిని ఇష్టపడతారు. అది వాళ్ల క్రికెట్ ఆడే స్టైల్" అని అశ్విన్ అన్నాడు.
ఈసారి కీలకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఇండియా వచ్చిన ఆస్ట్రేలియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండా నేరుగా సిరీస్ బరిలోకి దిగుతోంది. బెంగళూరు దగ్గరలోని ఆలూర్ లో ప్రత్యేకంగా స్పిన్ పిచ్ లను ఏర్పాటు చేయించుకొని మరీ ప్రాక్టీస్ చేస్తోంది. అంతేకాదు అశ్విన్ లాగే బౌలింగ్ చేసే మహేష్ పితియా అనే స్పిన్ బౌలర్ ను పిలిపించి అతని బౌలింగ్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. నాలుగు టెస్టుల సిరీస్ ఫిబ్రవరి 9న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
సంబంధిత కథనం