Karnataka Dalit woman : దళిత మహిళపై వివక్ష.. నీరు తాగిందని గోమూత్రంతో ట్యాంక్ 'శుద్ధి'!
Karnataka Dalit woman incident : తాగునీరు కోసం ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ నుంచి ఓ దళిత మహిళ నీరు తాగింది. కోపం తెచ్చుకున్న 'పెద్దలు'.. ట్యాంక్ను కడిగించి.. గోముత్రంతో శుద్ధి చేశారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
Karnataka Dalit woman incident : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్ల గడిచిపోయినా.. బీ ఆర్ అంబేడ్కర్ కలలు కన్న 'భారతం' మాత్రం నిజమవ్వడం లేదు. సమాజంలో ఏదో ఒక మూల బడుగు వర్గాలు.. ఏదో ఒక విధంగా వివక్షకు గురవుతూనే ఉన్నారు. కర్ణాటకలో తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ దళిత మహిళ.. మంచి నీరు తాగిందన్న కారణంతో కొందరు 'పెద్దలు' .. మొత్తం ట్యాంక్నే ఖాళీ చేయించేశారు. అనంతరం గోమూత్రంతో 'శుద్ధి' చేశారు!
ఇదీ జరిగింది..
కర్ణాటక చమరాజనగర జిల్లాలోని హెగ్గొటార గ్రామంలో ఈ నెల 18న జరిగింది ఈ ఘటన. ఎస్సీ వర్గానికి చెందిన ఓ మహిళ.. స్థానికంగా జరిగిన వివాహ వేడుకకు హాజరైంది. అక్కడే.. తాగునీరు కోసం ఏర్పాటు చేసిన ట్యాంక్లో నీరు తాగింది.
ఆ ప్రాంతంలో అగ్రకులం వారు నివాసముంటారు. ఈ విషయం వారి చెవిన పడింది. దళిత మహిళ తమ వాటర్ ట్యాంక్ ట్యాప్ ఓపెన్ చేసి నీరు తాగిందని విని.. ఆగ్రహంతో ఊగిపోయారు. చివరికి.. మొత్తం ట్యాంక్ను క్లీన్ చేయించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో.. ట్యాంక్లోని నీరంతా కింద పోయించేశారు. అనంతరం ట్యాంక్ను గోమూత్రంతో 'శుద్ధి' చేయించారని తెలుస్తోంది.
Heggotara village water tank : " నీళ్ల ట్యాంక్ను అయితే కడిగారు. గోమూత్రాన్ని వాడారో లేదో ఇంకా తెలియదు," అని స్థానిక తహసిల్దార్ ఐఈ బసవరాజ్.. ఓ జాతీయ మీడియాకు వెల్లడించారు. దళిత మహిళ.. మంచి నీరు తాగిందనడానికి ఆధారాలు లేవని, ఎవరూ కూడా చూడలేదని పేర్కొన్నారు.
మరోవైపు.. ఆ మహిళ ఆచూకీ లభించలేదని బసవరాజ్ అన్నారు. ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? వంటి వివరాలు తెలియడం లేదని పేర్కొన్నారు. ఆమె ఆచూకీ లభించిన తర్వాత.. మహిళ నుంచి ఫిర్యాదు తీసుకుని సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
ఈ ఘటనపై తహసిల్దార్.. జిల్లా కలెక్టర్కు సమగ్ర నివేదికను అందించాల్సి ఉంది.
'అందరు సమానమే..'
Discrimination on Dalit woman : ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అందరూ సమానమే అని చెప్పేందుకు.. స్థానిక అధికారులు చర్యలు చేపట్టారు. వివిధ గ్రామాల నుంచి దళితులు, ఓబీసీ వర్గానికి చెందిన వారిని పిలిపించి.. ట్యాంక్లో నీళ్లను తాగించారు.
"గ్రామాల్లోని ట్యాంకులపై.. 'ఈ నీటిని ఎవరైనా తాగవచ్చు' అని రాసుంది. ఎవరైనా తాగవచ్చు," అని అధికారులు పిలుపునిచ్చారు.
ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ‘పెద్దల’పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇంకెంతకాలం సమాజం ఇలా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.