Uddhav appeals to rebel MLAs | `మీరు నా ఆత్మబంధువులు`
Uddhav appeals to rebel MLAs: శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు భావోద్వేగ సందేశం పంపించారు మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే. మీరంతా ఇంకా మానసికంగా శివసేనతోనే ఉన్నారని, తిరిగి రావాలని వారికి విజ్ఞప్తి చేశారు.
శివసేన అనే కుటుంబానికి పెద్దగా, మీ గురించి ఆందోళన చెందుతున్నానని రెబెల్ ఎమ్మెల్యేలకు తెలిపారు.
Uddhav appeals to rebel MLAs : మాట్లాడుకుందాం రండి
``శివసేన కుటుంబానికి పెద్దను. కొన్ని రోజులుగా మీరు బంధింపబడి ఉన్నారు. మీ గురించి ఆందోళన చెందుతున్నాను. మీ హృదయాంతరాలల్లో మీరు శివసేనతోనే ఉన్నారు. మీ సెంటిమెంట్లను గౌరవిస్తాను. మీ సమస్యలను, అభ్యంతరాలను నాకు చెప్పండి. అన్నింటినీ పరిష్కరించుకుందాం. ముందు, ఇక్కడికి రండి. కలిసి మాట్లాడుకుందాం`` అని ఉద్ధవ్ ఠాక్రే రెబెల్ ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికీ ఆలస్యమేం కాలేదు
ఇప్పటికింకా ఆలస్యం కాలేదని, నా ముందుకు రావాలని తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఉద్ధవ్ కోరారు. ``ఇంకా సమయముంది. నా వద్దకు రండి. సమస్యలపై మాట్లాడండి. ప్రజల్లో, శివసైనికుల్లో నెలకొన్న అనుమానాలను తీరుద్దాం. మీ సెంటిమెంట్లను నేను గౌరవిస్తాను. శివసేనలో మీకు లభించిన గౌరవం మరెక్కడ మీకు దొరకదు`` అని ఉద్ధవ్ ఠాక్రే రెబెల్ ఎమ్మెల్యేలను అభ్యర్థించారు.
త్వరలోనే ముంబైకి..
తనతో పాటు తిరుగుబాటు ఎమ్మెల్యేలు త్వరలోనే ముంబైకి వస్తారని రెబెల్ ఎమ్మెల్యేల లీడర్ ఏక్నాథ్ షిండే వెల్లడించారు. తిరుగుబాటు ప్రారంభమైన తరువాత తొలిసారి మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే అంతా ముంబైకి వస్తామని చెప్పారు. అయితే, కచ్చితంగా ఏ రోజు వస్తారనే విషయం మాత్రం ఆయన వెల్లడించలేదు. దాదాపు 20 మంది రెబెల్ ఎమ్మెల్యేలు మళ్లీ ఉద్ధవ్ ఠాక్రేతో సంప్రదింపులు జరుపుతున్నారన్న వార్తలపై స్పందిస్తూ.. అవి నిజాలు కావని, ఎమ్మెల్యేలంతా స్వచ్ఛంధంగా వచ్చారని స్పష్టం చేశారు. హిందుత్వ వాదాన్ని ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంతో అంతా ఏకమయ్యామన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో ఎవరు వారితో టచ్లో ఉన్నారో వారి పేర్లు చెప్పాలని శివసేన నాయకులకు సవాలు చేశారు.