Railways news: త్వరలో నిమిషానికి 2 లక్షల టికెట్ల జారీ
Railways news: ప్రయాణికులకు వేగవంతమైన సేవలను అందించే లక్ష్యంతో భారతీయ రైల్వే ముందుకు సాగుతోంది. అందులో భాగంగా టికెట్ల జారీలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తోంది.
Railways news: ఇప్పటివరకు ఐఆర్సీటీసీ (IRCTC) లో గరిష్టంగా నిమిషానికి 25 వేల టికెట్లను మాత్రమే జారీ చేయడం సాధ్యమవుతుంది. ఈ సంఖ్యను గణనీయంగా పెంచాలని రైల్వే శాఖ (Indian Railway) నిర్ణయించింది.
ట్రెండింగ్ వార్తలు
IRCTC NEWS: నిమిషానికి 2.25 లక్షలు
ప్రస్తుతం ఉన్న నిమిషానికి 25 వేల ఈ - టికెట్ల జారీ సామర్ధ్యాన్ని మరింత పెంచే దిశగా రైల్వే శాఖ (Indian Railway) ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి నిమిషానికి 2.25 లక్షల ఈ - టికెట్లను జారీ చేసేలా ఐఆర్సీటీసీ (IRCTC) ప్యాసెంజర్ రిజర్వేషన్ సిస్టమ్ సామర్ధ్యాన్ని పెంచుతామని రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ వెల్లడించారు. తద్వారా ప్రయాణికులకు మరింత వేగవంతమైన సేవలు అందుతాయన్నారు. అలాగే, ప్రయాణికుల ఎంక్వైరీలకు సమాధానమిచ్చే వ్యవస్థను కూడా మెరుగుపర్చనున్నామని తెలిపారు. ప్రస్తుతం నిమిషానికి 4 లక్షల ఎంక్వైరీలను అటెండ్ చేస్తున్నామని, దీన్ని త్వరలో నిమిషానికి 40 లక్షలకు పెంచుతామని వెల్లడించారు.
New Railway tracks: 7 వేల కిమీల ట్రాక్స్
ఈ 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 7 వేల కిమీల మేర కొత్త ట్రాక్స్ ను వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు. వాటిలో 4500 కిమీలు కొత్త లైన్లు కాగా, మిగితావి డబ్లింగ్, గాగ్ కన్వర్జన్స్ అని వివరించారు. అంటే, 2014 కన్నా ముందు రోజుకు సగటున 4 కిమీల రైల్వే లైన్ మాత్రమే వేసే వారని, తమ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ సగటు 12కిమీలకు పెరిగిందని వివరించారు. 2014లో అధికారంలోకి వచ్చిననాటి నుంచి మొత్తం 10,438 ఫ్లైఓవర్లను, అండర్ పాస్ లను నిర్మించామన్నారు. 2000 రైల్వే స్టేషన్లలో 24 గంటలు తెరిచి ఉండే జన సువిధ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.