Manipur govt decision| నలుగురి కంటే ఎక్కువ పిల్లలుంటే ప్రభుత్వ ప్రయోజనాలు కట్
Manipur govt decision| జనాభా నియంత్రణలో భాగంగా మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నలుగురి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే, వారికి ప్రభుత్వ ప్రయోజనాలు అందవని స్పష్టం చేసింది.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ జనాభా నియంత్రణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నలుగురి కంటే ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాలకు ఇకపై ప్రభుత్వ ప్రయోజనాలేవీ అందవని స్పష్టం చేసింది.
Manipur govt decision| పాపులేషన్ కమిషన్
మణిపూర్ అసెంబ్లీ ఒక ప్రైవేటు సభ్యుడి తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రంలో పాపులేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలన్న ఆ తీర్మానాన్ని అసెంబ్లీ లో బీజేపీ సభ్యుడు కుముక్చన్ జైకిసాన్ ప్రవేశపెట్టారు. మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మణిపుర్ స్టేట్ పాపులేషన్ కమిషన్ ఏర్పాటును శుక్రవారం లాంఛనంగా ఆమోదించారు. అలాగే, నలుగురి కన్నా ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాల్లో.. ఏ ఒక్కరికి కూడా, ఏ విధమైన ప్రభుత్వ ప్రయోజనాలు అందవని స్పష్టం చేశారు.
Manipur govt decision| జనాభా పెరుగుదల
2011 జనగణన ప్రకారం మణిపూర్ జనాభా 28.56 లక్షలు. 2001 జనాభా లెక్కల ప్రకారం అది 22.93 లక్షలు మాత్రమే. 1971 నుంచి 2001 మధ్య మణిపూర్ జనాభా 153.3% పెరిగితే, 2001 నుంచి 2011 మధ్య అసాధారణంగా 250% పెరుగుదల నమోదైంది. అధిక సంతానంతో పాటు అక్రమ చొరబాట్ల కారణంగానే ఈ పెరుగుదల నమోదైనట్లు భావిస్తున్నారు.