Nitish Kumar | 2024 నాటికి ఎన్డీయేకు ప్రత్యామ్నాయం
Nitish Kumar | 2024 ఎన్నికల నాటికి దేశంలోని విపక్షాలన్నీ ఒక ఐక్య కూటమిగా ఏర్పడాల్సిన అవసరం ఉందని బిహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. బుధవారం నూతన సీఎంగా ప్రమాణం చేసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Nitish Kumar | జాతీయ స్థాయిలో అధికార ఎన్డీయే కు ప్రత్యామ్నాయంగా ఒక జాతీయ కూటమి రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉందని బిహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. అయితే, ఆ కూటమి తరఫున ప్రధాని పదవి కోసం తాను రేసులో లేనని స్పష్టం చేశారు. విపక్షాల కూటమికి ప్రధాని అభ్యర్థిగా నిలవడం కోసమే ఎన్డీయే నుంచి నితీశ్ వైదొలగారన్న వార్తలపై ఆయన స్పందించారు. `విపక్షాలన్నీ ఏకం కావాలన్నది నా కోరిక. పీఎం కావాలన్న ఆశ నాకు లేదు` అన్నారు. `గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే సీఎం కావాలనుకోలేదు. కానీ పెద్ద ఎత్తున వచ్చిన ఒత్తిడి వల్ల సీఎం పదవి స్వీకరించాల్సిన వచ్చింది` అన్నారు.
Nitish Kumar | విపక్షాలకు పిలుపు
రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయేను ఉమ్మడిగా ఎదుర్కోవాలని దేశంలోని విపక్షాలకు బిహార్ సీఎం నితీశ్ సూచించారు. బీజేపీకి దూరం కావాలన్న నిర్ణయం తానొక్కడు తీసుకున్నది కాదని, పార్టీ మొత్తం ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయమని ఆయన వివరించారు. జేడీయూను బలహీనపరచేందుకు 2020 నుంచి బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. 2024లో కేంద్రంలో బీజేపీ విజయం సాధించడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.
Nitish Kumar | పీఎం సీటు రిజర్వ్డ్
ప్రధాన మంత్రి స్థానం ఎవరికి ఇవ్వాలనే విషయంలో దేశ ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ వ్యాఖ్యానించారు. జీవితకాలం నరేంద్ర మోదీనే దేశ ప్రధానిగా ఉంటారన్నారు.