Wedding Ceremony: రసగుల్లా అయిపోయిందని చంపేశారు..
Wedding Ceremony: ఆగ్రాలో ఓ వివాహ వేడుకలో స్వీట్లు సరిపోక జరిగిన ఘర్షణ హత్య వరకూ వెళ్లింది.
ఆగ్రా, అక్టోబరు 27: స్వీట్స్ లేవని ఆగ్రా ఎత్మాద్పూర్లో వివాహ వేడుకలో జరిగిన ఘర్షణలో 22 ఏళ్ల యువకుడు మృతి చెందగా, ఐదుగురు గాయపడినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు
మొహల్లా షైఖాన్ నివాసి ఉస్మాన్ కుమార్తె వివాహ వేడుకలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. రసగుల్లాలు అయిపోయాయని వధువు, వరుడి పక్షాల మధ్య వాగ్వాదం చెలరేగిందని పోలీసులు తెలిపారు.
ఎత్మాద్పూర్ సర్కిల్ ఆఫీసర్ రవి కుమార్ గుప్తా పీటీఐతో మాట్లాడుతూ ‘మిఠాయి కొరతపై జరిగిన వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. దీంతో ఓ వ్యక్తి హాజరైన కొందరిపై కత్తితో దాడి చేశాడు..’ అని వివరించారు.
గుప్తా మాట్లాడుతూ ‘దాడిలో తీవ్రంగా గాయపడిన సన్నీ (22)ని మొదట కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు పంపారు, ఆపై ఆగ్రాలోని సరోజిని నాయుడు మెడికల్ కాలేజీకి రెఫర్ చేశారు. అక్కడ అతడు చికిత్స పొందుతూ మరణించాడు. అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపారు..’ అని వివరించారు.
దాడిలో గాయపడిన ఐదుగురిని ఎత్మాద్పూర్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
బాధితురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని గుప్తా తెలిపారు.