Telugu News  /  National International  /  Maharashtra Assembly: Cm Eknath Shinde Wins Trust Vote With 164-99 Margin
విధాన సభ వద్ద ఏక్‌నాథ్ షిండే
విధాన సభ వద్ద ఏక్‌నాథ్ షిండే (PTI)

Maharashtra Assembly: విశ్వాస పరీక్ష నెగ్గిన ఏక్‌నాథ్ షిండే

04 July 2022, 13:13 ISTHT Telugu Desk
04 July 2022, 13:13 IST

ఊహించినట్టుగానే మహారాష్ట్ర తాజా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విశ్వాస పరీక్ష నెగ్గారు.

ముంబై (మహారాష్ట్ర, జూలై 4: మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం సోమవారం జరిగిన ఫ్లోర్ టెస్ట్‌లో 164-99 తేడాతో గెలిచి మెజారిటీని నిరూపించుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

షిండేకు అనుకూలంగా 164 ఓట్లు పోల్ కాగా, బీజేపీ-షిండే క్యాంపు కూటమికి వ్యతిరేకంగా 99 ఓట్లు పోలయ్యాయి.

బీజేపీకి చెందిన రాహుల్ నార్వేకర్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికైన మరుసటి రోజే విశ్వాస పరీక్ష జరిగింది. ఆదివారం నార్వేకర్ శివసేన శాసనసభా పక్ష నేతగా షిండేను తిరిగి నియమించారు. శివసేన చీఫ్ విప్‌గా గోగావాలే నియామకాన్ని కూడా గుర్తించారు.

ఆదివారం ప్రారంభమైన రెండు రోజుల ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో ఇవాళ బలపరీక్ష జరిగింది. మొత్తం ముగ్గురు సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

విశ్వాస పరీక్ష ముగిసిన వెంటనే శివసేన నాయకుడు, ఇంతకుముందు వరకు విప్‌గా ఉన్న సునీల్ ప్రభు విప్ అంశాన్ని లేవనెత్తారు. అయితే ఆయనను కూర్చోవలిసిందిగా స్పీకర్ కోరారు.

శివసేనకు చెందిన ఆదిత్య ఠాక్రే మూజువాణి ఓటు కోసం డోర్లు మూసేయడానికి కొద్ది నిమిషాల ముందు సభకు వచ్చారు.

కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రులు అశోక్ చవాన్, విజయ్ వాడెట్టివార్ సభకు దూరంగా ఉన్నందున వారు ఓటు వేయలేదు.. నవాబ్ మాలిక్, అనిల్ దేశ్‌ముఖ్ కూడా ఓటు వేసేందుకు సభకు రాలేదు.

అంతకుముందు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ ప్రతిపక్షాల డిమాండ్‌ను అనుమతించి ఓటింగ్ నిర్వహించారు.

విశ్వాస పరీక్షను బీజేపీకి చెందిన సుధీర్ ముంగంటివార్, శివసేనకు చెందిన భరత్ గోగావాలే ప్రతిపాదించారు. మూజువాణి ఓటు అనంతరం విశ్వాస తీర్మానం ప్రతిపాదనపై ప్రతిపక్ష సభ్యులు ఓటింగ్‌ కోరారు.

మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సంతోష్ బంగర్, శ్యాంసుందర్ షిండే విశ్వాస పరీక్షకు ముందు ఏకనాథ్ షిండే క్యాంపులో చేరారు.

31 నెలల మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వ పతనం అనంతరం ఏకనాథ్ షిండే జూన్ 30న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

2014-19 మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫడ్నవీస్ గురువారం ముంబైలో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఏక్‌నాథ్ షిండే కొత్త సీఎం అవుతారని ప్రకటించారు. తాను ప్రభుత్వంలో భాగం కాబోనని కూడా ఫడ్నవీస్ మీడియా సమావేశంలో ప్రకటించారు.

టాపిక్