Madrasa students clear NEET: వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష NEET. ఈ పరీక్షలో మదరసాల్లో చదువుకున్న కొందరు విద్యార్థులు ఉత్తీర్ణులై, మదరాలపై ఉన్న దురభిప్రాయాలను తొలగించారు. అందులో కొందరు విద్యార్థులు గుర్తింపు పొందని మదరసాల్లో కూడా చదువుకున్నారు.
గుర్తింపు పొందని మదరసాలపై సర్వే నిర్వహించనున్నారనే వార్తల నేపథ్యంలో.. కొందరు మదరసా విద్యార్థులు నీట్ పరీక్షను క్లియర్ చేయడం విశేషం. సాధారణంగా మదరసాల్లో ముస్లిం మత విద్యను మాత్రమే బోధిస్తారని, అక్కడ చదువుకున్న వారు ఆధునిక విద్యను అందిపుచ్చుకోలేరనే ఒక వాదన ఉంది. అయితే, ఈ వాదనను తోసిపుచ్చేలా కొందరు మదరసా విద్యార్థులు భవిష్యత్ డాక్టర్లుగా మారనున్నారు.
బెంగళూరుకు చెందిన హఫీజ్ మొహమ్మద్ అలీ ఇక్బాల్ ఈ సంవత్సరం నీట్ పరీక్షలో 680 మార్కులు సాధించారు. ఇతడు మదరసా విద్యా విధానంలోనే హిఫ్జుల్ కోర్సును పూర్తి చేశారు. ‘మదరసాల్లో హిఫ్జుల్ కోర్సు చదువుకున్న వారు అయితే, ఇమామ్ లు గానో, లేక టైలర్లు గానో మారుతారనే అభిప్రాయం ఉంది. కానీ, అవకాశం దొరికి, సరైన గైడెన్స్ లభిస్తే మదరసా విద్యార్థులు కూడా ఆధునిక విద్యలో ఉత్తమ ఫలితాలు సాధించగలరు’ అని హఫీజ్ మొహమ్మద్ అలీ ఇక్బాల్ వ్యాఖ్యానించారు. హఫీజ్ మొహమ్మద్ సైఫుల్లా కూడా ఈ సంవత్సరం నీట్ లో 577 మార్కులు సాధించాడు. అలాగే, హఫీజ్ గులాం అహ్మద్ జెర్డీ కూడా నీట్ లో 646 మార్కులు సాధించాడు. మదరసాలో ఖురాన్ చదువుకోవడం వల్ల ఏకాగ్రత, పట్టుదల పెరుగుతుందని, నీట్ లో 602 మార్కులు సాధించిన ముంబై కి చెందిన హుజైఫా వివరించారు. వీరంతా కర్నాటకలోని షాహీన్ గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్స్ లో చదువుకున్నారు. ఈ సంస్థలో నీట్ పరీక్ష కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తారు.