Diabetes deaths | డయాబెటిస్తో లక్ష మరణాలు.. వరుసగా రెండో ఏడాది
అమెరికాలో 2021లో డయాబెటిస్తో లక్ష మందికి పైగా మరణించారు. డయాబెటిస్ వల్ల మరణాల సంఖ్య లక్ష దాటడం వరుసగా ఇది రెండో ఏడాది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు హెచ్ఐవీ-ఎయిడ్స్పై చేసిన పోరాటం తరహాలో దీనిపై కూడా ప్రత్యేక వ్యూహాలు అమలు చేయాలని ఫెడరల్ పానెల్ సూచిస్తోంది.
అమెరికాలో వరుసగా రెండో ఏడాది కూడా డయాబెటిస్ కారణంగా నమోదైన మరణాల సంఖ్య లక్ష దాటింది. కేవలం వైద్యపరమైన జోక్యాలపైనే ఆధారపడకుండా ముందుకు వెళ్లాలనే సిఫార్సులతో సహా మధుమేహం నుంచి సంరక్షణ, నివారణ వ్యూహాలను సరిదిద్దాలని నిపుణుల ప్యానెల్ అమెరికా పార్లమెంటును కోరడంతో కొత్త గణాంకాలు వచ్చాయి. ఈ నెల ప్రారంభంలో విడుదల చేసిన ఒక నివేదిక మధుమేహం మహమ్మారిని అరికట్టడానికి వీలుగా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల వినియోగాన్ని ప్రోత్సహించడం, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను ఇవ్వడం, చక్కెర పానీయాలపై పన్నులు విధించడం, సరసమైన గృహాల లభ్యత ఉండేలా చూడడం వంటి విస్తృత విధాన మార్పులను కోరింది.
2019లో అత్యధిక మరణాలకు కారణమైన వాటిలో ఏడో అతి పెద్ద అంశంగా డయాబెటిస్ నిలిచింది. ఆ ఏడాది 87,000 మరణాలు సంభవించాయి. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో డయాబెటిస్ ఉన్న వారికి ఆరోగ్య సంరక్షణలో మరిన్ని సవాళ్లు ఎదురయ్యాయి. అప్పటి నుంచి అమెరికాలో డయాబెటిస్ మరణాలు మరిన్ని పెరిగిపోయాయి. గడిచిన రెండేళ్లుగా ఏటా లక్షకు పైగా డయాబెటిస్ మరణాలు సంభవించాయి. డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రొటెక్షన్ (సీడీసీ) డేటా ఆధారంగా రాయిటర్స్ చేసిన విశ్లేషణలో ఈ వివరాలు వెలువడ్డాయి. కోవిడ్ మహమ్మారి కంటే ముందు 2019లో ఉన్న డేటాతో పోల్చితే డయాబెటిస్ సంబంధిత మరణాలు 2020లో 17 శాతం పెరగగా, 2021లో 15 శాతం పెరిగాయి.
నివారించదగినదే..
‘వరుసగా రెండో సంవత్సరం ఎక్కువ సంఖ్యలో మధుమేహ సంబంధిత మరణాలు సంభవించడం కచ్చితంగా ప్రమాదకర సంకేతమే..’ అని ఫీల్డింగ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లోని ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ పాల్ హ్సు అన్నారు. ‘టైప్ 2 డయాబెటిస్ నిజానికి నివారించదగినది. అయినప్పటికీ మరణాలు సంభవించడం ప్రమాదకరమైన సంకేతం..’ అని పేర్కొన్నారు.
ఎక్కువ మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడకుండా, ఇప్పటికే డయాబెటిస్తో బాధపడుతున్న వారు ప్రాణాంతకమైన సమస్యల బారిన పడకుండా సాయం అందేలా సమగ్ర వ్యూహం అనురించాలని అమెరికా పార్లమెంటు వేసిన నేషనల్ క్లినికల్ కేర్ కమిషన్ సూచించింది. సదరు కమిషన్ గణాంకాల ప్రకారం అమెరికా జనాభాలో 11 శాతం.. అంటే సుమారు 37 మిలియన్ల మంది డయాబెటిస్తో బాధపడుతున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే ప్రతి ముగ్గురిలో ఒకరు డయాబెటిస్ బారిన పడే ప్రమాదం ఉందని కమిటీ ఆందోళన వ్యక్తంచేసింది.
‘అమెరికాలో మధుమేహాన్ని కేవలం వైద్య లేదా ఆరోగ్య సంరక్షణ సమస్యగా చూడలేం. ఆహారం, గృహాలు, వాణిజ్యం, రవాణా, పర్యావరణంతో సహా అనేక రంగాలతో ముడివడి ఉన్న సామాజిక సమస్యగా కూడా పరిగణించి పరిష్కారం చూపాలి..’ అని కమిషన్ తన నివేదికలో సూచించింది.