Chinese permanent shelters in Depsang: భారత భూభాగంలో చైనా శాశ్వత స్థావరాలు
Chinese permanent shelters in Depsang: చైనా మరోసారి భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది. భారత సరిహద్దు భద్రతకు అత్యంత కీలకమైన ప్రాంతాల్లో శాశ్వత స్థావరాలను నిర్మిస్తోంది.
చైనాతో వాస్తవాధీన రేఖ సరిహద్దును పంచుకునే లద్దాఖ్ లో భారత భూభాగం వైపు చైనా శాశ్వత మిలటరీ నిర్మాణాలను ఏర్పాటు చేస్తోంది. ఈ విషయాన్ని ఉపగ్రహ ఛాయా చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
Chinese permanent shelters in Depsang: లద్దాఖ్ లో..
లద్దాఖ్ లోని వ్యూహాత్మకంగా కీలకమైన దెస్పాంగ్ ప్రాంతంలో భారత భూభాగంలో చైనా శాశ్వత నిర్మాణాలు చేపట్టింది. అన్ని వాతావరణ పరిస్థితుల్లో సైనికులు ఉండడానికి అనుకూలంగా ఉండేలా ఈ స్థావరాలను నిర్మించింది. ఇది భారత్ కు రక్షణ పరంగా చాలా ప్రమాదకరమని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవాధీన రేఖకు ఇవతల, అంటే భారత్ భూభాగంలో 15 నుంచి 18 లోపల ఈ నిర్మాణాలు చేపట్టింది. అక్కడ దాదాపు 2 వందలకు పైగా ఇలాంటి స్థావరాలను చైనా నిర్మించింది. అలాగే, అన్ని మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేసింది.
Chinese permanent shelters in Depsang: కాంగ్రెస్ విమర్శలు
లద్దాఖ్ లోని వ్యూహాత్మక ప్రాంతాల్లో చైనా శాశ్వత నిర్మాణాలు చేపట్టినా.. భారత ప్రభుత్వం నోరు మెదపడం లేదని కాంగ్రెస్ విమర్శించింది. ఈ విషయంలో మోదీ మౌనాన్ని, భారత భూభాగం ఒక్క అంగుళం కూడా ఆక్రమణకు గురి కాలేదని గతంలో భారత ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను చైనా తనకు అనుకూలంగా మరల్చుకుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియ శ్రినాటే వ్యాఖ్యానించారు. దేమ్చుక్, దెస్పాంగ్ ల్లో చైనా నిర్మాణాలకు సంబంధించిన ఉపగ్రహ ఛాయా చిత్రాలను చూపుతూ.. చైనా ఆక్రమణలపై భారత ప్రభుత్వ స్పందించడం లేదని విమర్శించారు. ఇండోనేషియాలో జీ 20 సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు ఎర్ర రంగు చొక్కా వేసుకుని మరీ షేక్ హ్యాండ్ ఇచ్చిన ప్రధాని.. ఈ విషయంపై ఆయనను ఎందుకు నిలదీయరని ప్రశ్నించారు.
Chinese permanent shelters in Depsang: ప్రధాని మోదీ మౌనం ఎందుకు?
ఒకవైపు, చైనా తన సరిహద్దులను బలోపేతం చేసుకుంటూ ఉంటే, మరోవైపు భారత్ తన సొంత భూభాగాలను కోల్పోతూ వస్తోందని ఆరోపించారు. ప్యాంగ్యాంగ్ సొ సరస్సు చుట్టూ చైనా పీఎల్ ఏ డివిజన్ ప్రధాన కార్యాలయాన్ని, ఆయుధాగారాన్ని, విమాన విధ్వంసక ఆయుధ వ్యవస్థల షెల్టర్ ను నిర్మించిందన్నారు. తూర్పు లద్దాఖ్ లో గాల్వన్ ఘర్షణలు జరగడానికి ముందు, ఏప్రిల్ 2020 నాటి పరిస్థితి ఎప్పుడు నెలకొంటుందని, అందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ‘సొంత భూభాగాలను కోల్పోవడమేనా బీజేపీ చెప్పే జాతీయవాదం’ అని సుప్రియ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఆరోపణలపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన వెలువడలేదు.