లైవ్ స్ట్రీమ్లో.. మాజీ భార్యకు నిప్పంటించిన వ్యక్తికి 'ఉరి'
2020లో చైనాలో సంచలనం సృష్టించిన ‘లాము’ కేసులో న్యాయం జరిగింది! లాము అనే మహిళను తన మాజీ భర్త నిప్పంటించి చంపేశాడు. లైవ్ స్ట్రీమ్లో ఇదంతా రికార్డు అయ్యింది. చివరికి ఆ వ్యక్తికి ఉరిశిక్ష అమలైంది.
మాజీ భర్త చేతిలో హత్యకు గురైన చైనా మహిళకు న్యాయం జరిగింది! లైవ్ స్ట్రీమ్లో మహిళకు నిప్పంటించిన భర్తను ఉరితీశారు. శనివారం ఈ ఉరిశిక్ష అమలైంది.
అసలేం జరిగిందంటే..
నైరుతి సిచియాన్ రాష్ట్రంలో కొన్నేళ్ల క్రితం టాంగ్ లూ, తన భార్య లాము(ఆన్లైన్ పేరు)తో కలిసి నివాసముండేవాడు. వారిద్దరు సామాజిక మాధ్యమాల్లో 'ఇన్ఫ్లుయెంజర్లు'. కాగా.. 2020 జూన్లో వారిద్దరు విడిపోయారు. అప్పటి నుంచి టాంగ్ లూ.. లాము వెంటపడేవారు. తనను మళ్లీ పెళ్లి చేసుకోవాలని వేధించేవాడు. ఆమె అందుకు ఒప్పుకోలేదు.
ఈ క్రమంలోనే అదే ఏడాది సెప్టెంబర్లో.. టిక్టాక్తో పోలిన ఓ చైనా యాప్లో లాము లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగా ఒక్కసారిగా దాడి చేశాడు టాంగ్ లూ. ఆమె శరీరానికి నిప్పు అంటించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఆమె ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటన చైనావ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రజలందరు లాముకు మద్దతుగా నిలిచారు. మహిళలు ఎదుర్కొంటున్న గృహ హింసకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు.
ఘటన జరిగిన వెంటనే టాంగ్ లూను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుపై ముమ్మరంగా దర్యాప్తు చేసి కోర్టులో హాజరుపరిచారు. 2021 అక్టోబర్లో.. అతనికి కోర్టు ఉరిశిక్షను విధించింది. ఉరిశిక్ష రద్దు కోసం 2022 జనవరిలో టాంగ్ లూ విజ్ఞప్తి చేసుకోగా.. అందుకు కోర్టు నిరాకరించింది. చివరికి ఈ శనివారం ఉరిశిక్ష అమలైంది.
ఉరిశిక్షకు ముందు.. టాంగ్ లూ తన కుటుంబసభ్యులతో కొంతసేపు గడిపినట్టు సమాచారం.
సంబంధిత కథనం