నదిలో పడిన వాహనం.. ఏడుగురు వైద్య విద్యార్థులు దుర్మరణం
పార్టీకి వెళ్లొస్తున్న ఏడుగురు వైద్య విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటన మహారాష్ట్ర నాగ్పూర్లో జరిగింది. వారు ప్రయాణిస్తున్న వాహనం.. వంతెనపై నుంచి నదిలోకి పడిపోయింది.
Maharastra road accident: మహారాష్ట్ర నాగ్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున వార్దాలోని సెల్సురా వద్ద.. ఓ కళాశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న వాహనం వంతెనపై నుంచి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
ట్రెండింగ్ వార్తలు
పార్టీకి వెళ్లొస్తూ..
పోలీసుల సమాచారం ప్రకారం.. మృతుల్లో కొందరు సావాంగిలోని జవహర్లాల్ నెహ్రూ వైద్య కళాశాల విద్యార్థులు. పార్టీ చేసుకునేందుకు సోమవారం అర్ధరాత్రి ఓ ఢాబాకు వెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి తిరుగు పయనమయ్యారు. భదరి నది వంతెనపైకి వచ్చేసరికి వాహనంపై డ్రైవర్ పట్టుకోల్పోయాడు. వంతెనను ఢీకొట్టిన వాహనం.. చివరికి నదిలో పడిపోయింది.
మృతులను విజయ్ రహంగ్దలే, నితీశ్ సింగ్, వివేక్ నందన్, ప్రత్యూష్ సింగ్, శుభం జైశ్వాల్, నీరజ్ చౌహాన్, పవన్ శక్తిగా గుర్తించారు. వీరిలో విజయ్ రహంగ్దలే.. బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు.
విద్యార్థులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టినా ఫలితం దక్కలేదు. చివరికి మృతదేహాలను నదిలో నుంచి వెలికితీశారు.
ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అకస్మాత్తుగా ఓ జంతువు ఎదురు వచ్చిందని, పరిస్థితిని అదుపుచేసే క్రమంలో డ్రైవర్ వాహనంపై పట్టుకోల్పోవడం వల్లే ఘటన జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది.
ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు.