EPFO Meeting: నేటి నుంచే ఈపీఎఫ్వో మీటింగ్: ఉద్యోగుల్లో ఉత్కంఠ!
EPFO Meeting: ఈపీఎఫ్వో బోర్డు సమావేశం నేడు మొదలైంది. 2022-23కు సంబంధించి ఈపీఎఫ్ వడ్డీ రేటుపై ఎలాంటి నిర్ణయం వస్తుందోనని ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
EPFO Meeting: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (Employees Provident Fund Organisation - EPFO)కు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) రెండు రోజుల సమావేశం నేడు (మార్చి 27) మొదలైంది. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో నేడు, రేపు అధికారులు చర్చించనున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్పై ఎంత వడ్డీ రేటు (EPF Interest Rate) ఇవ్వాలన్న దానిపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. దీంతో ఈపీఎఫ్వో సీబీటీ నిర్ణయం కోసం ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
EPFO Meeting: వడ్డీ రేటు, అధిక పెన్షన్, వార్షిక ఆర్థిక అంచనాలతో పాటు మరిన్ని అంశాలపై రెండు రోజుల సమావేశంలో ఈపీఎఫ్వో బోర్డు అధికారులు చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇది కీలక మీటింగ్గా ఉంది.
అదే కొనసాగింపు!
EPFO Meeting: 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్పై 8.1 శాతం వడ్డీ రేటును గత మార్చిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత నాలుగు దశాబ్దాల్లో ఇదే అత్యల్పం. దీంతో సుమారు ఆరు కోట్ల మంది ఈపీఎఫ్వో చందాదారులు (ఉద్యోగులు) కాస్త నిరాశకు లోనయ్యారు. అయితే ఈసారి కూడా ఇదే వడ్డీ రేటు కొనసాగుతుందనే అంచనాలు ఉన్నాయి. 8 శాతం కంటే వడ్డీ రేటు తగ్గదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రెపో రేటు అధికంగా ఉన్న కారణంగా ప్రస్తుతం బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు కూడా పెరిగాయి. దీంతో పీఎఫ్పై వడ్డీ రేటును ఈపీఎఫ్వో ఇంకా తగ్గించబోదన్న వాదన వినిపిస్తోంది.
జనవరిలో కొత్తగా 14.86లక్షల మంది
ఈ ఏడాది జనవరిలో ఈపీఎఫ్ఓలో కొత్తగా 14.86 లక్షల మంది సభ్యులు చేరారని కేంద్ర కార్మిక, ఉద్యోగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ నెలలో ఈవీఎఫ్వో నుంచి 3.54లక్షల మంది బయటికి వెళ్లాలని తెలిపింది. గత నాలుగు నెలల్లో ఇదే అత్వల్పమని పేర్కొంది.
2014 ఆగస్టు 31 కంటే ముందు చేరిన వారు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని ఈపీఎఫ్వో ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. ఉద్యోగులకు, సంస్థలకు ఉమ్మడి ఆప్షన్ కల్పించింది. అయితే ఈ ప్రక్రియ ఆలస్యంగా జరుగుతుండటం, సాంకేతిక లోపాలతో పాటు నిబంధనలు తికమకగా ఉండటంతో ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కూడా రెండు రోజుల సమావేశంలో ఈవీఎఫ్వో తీవ్రంగా చర్చించే అవకాశం ఉంది.
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రావిడెంట్, పెన్షన్, ఇన్సూరెన్స్ ఫండ్స్ లాంటి సదుపాయాలను సామాజిక భద్రత సంస్థ ‘ఈపీఎఫ్వో’ కల్పిస్తోంది.
సంబంధిత కథనం
టాపిక్