October 22 Telugu News Updates : గ్రూప్-1 ప్రిలిమినరీ ఘటనపై TSPSC సీరియస్!
- ఏపీ, తెలంగాణ తాజా వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేస్తూ ఉండండి..
Sat, 22 Oct 202204:39 PM IST
రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలి
20 ఏళ్లు సోపతి చేసిన తర్వాత తనని పార్టీ నుంచి కేసీఆర్ బయటికి వెళ్లగొట్టారని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా... చండూరు లోని ముదిరాజ్ సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో.. ప్రభుత్వం వచ్చాక తన పాత్ర ఏందో అందరికీ తెలుసని చెప్పారు.
Sat, 22 Oct 202204:09 PM IST
షర్మిల పైర్…
కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు షర్మిల. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో రూ.70 వేల కోట్ల అవినీతి జరిగిందని అన్నారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. ప్రాజెక్ట్ రీడిజైన్ పేరుతో సీఎం కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Sat, 22 Oct 202202:31 PM IST
కేటీఆర్ ఫైర్….
జనహితమే టీఆర్ఎస్ ప్రభుత్వ అభిమతమన్నారు మంత్రి కేటీఆర్. కులం, మతం అనేది తేడా లేకుండా సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని చెప్పారు. పారిశ్రామికవేత్తల నుంచి శ్రామికుల వరకు అన్నివర్గాలకు లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఏర్పాటు చేసిన లారీ యజమానులు, డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sat, 22 Oct 202201:30 PM IST
నో అలయెన్స్..!
పొత్తులపై ఏపీ బీజేపీ వ్యవహారాల కో ఇంఛార్జ్ సునీల్ ధియోధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు ఉండదని స్పష్టం చేశారు.
Sat, 22 Oct 202212:54 PM IST
స్పెషల్ ప్యాకేజీ…..
తెలంగాణ ఆర్టీసీ... ఇప్పటికే రకరకాల ప్యాకేజీల ప్రవేశపెట్టి ప్రయాణికులను ఆకర్షిస్తోంది. వినూత్న నిర్ణయాలతో మనన్నలను పొందే ప్రయత్నం చేస్తోంది. ఇక తాజాగా ప్రకృతి ప్రేమికుల కోసం ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.
రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు విహారయాత్రల కోసం ప్రత్యేక ప్యాకేజీలను తీసుకువచ్చింది. పోచంపాడు, పొచ్చెర, కుంటాల జలపాతాలకు (Waterfalls) ప్రత్యేక సర్వీసులను ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి ఈ ప్రత్యేక సర్వవీసులు అందుబాటులో ఉన్నాయి.
Sat, 22 Oct 202212:11 PM IST
సీరియస్…
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష సందర్భంగా సికింద్రాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ డీసేల్స్ హైస్కూల్లో జరిగిన ఘటనపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విచారణ మొదలుపెట్టింది. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే ఆ అభ్యర్థులపై కఠిన చర్యలకు కమిషన్ కసరత్తు మొదలుపెట్టింది.
Sat, 22 Oct 202212:10 PM IST
చంద్రబాబు ట్వీట్..
అమరావతిపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజు ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన జరిగిందన్నారని రాసుకొచ్చారు. వెయ్యేళ్లపాటు తెలుగుజాతి గుండెచప్పుడుగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
ప్రస్తుత పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనం అయిందని ఆయన చంద్రబాబు మండిపడ్డారు. అమరావతి అంటే 28వేల మంది రైతుల త్యాగం, కోట్ల మంది సంకల్పం అని అన్నారు. ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రులు అమరావతిని తమకు గర్వకారణంగా భావించారన్న చంద్రబాబు... ఎన్నికల ముందు అమరావతిని స్వాగతించిన వ్యక్తి... అధికారంలోకి రాగానే మాట మార్చి మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sat, 22 Oct 202210:42 AM IST
స్రవంతి రియాక్షన్….
ఎంపీ కోమటిరెడ్డి కామెంట్స్ పై కాంగ్రెస్ అభ్యర్ధి స్రవంతి స్పందించారు. నమ్మకద్రోహం చేసేలా మాట్లాడటం బాధగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అందరూ కంకణబద్ధులై పనిచేస్తున్నారని చెప్పారు. ఆయన వ్యాఖ్యలను పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు.
Sat, 22 Oct 202210:40 AM IST
టూర్ షెడ్యూల్ ఖరారు….
రేపు తెలంగాణలోకి రాహుల్ జోడో యాత్ర రాబోతుంది. కర్ణాటకలోని రాయచూర్ నుంచి అక్టోబర్ 23 తేదీ ఉదయం 10 గంటలకు తెలంగాణాలోని మహబూబ్ నగర్ జిల్లా, గూడబెల్లూరులో అడుగుపెట్టనుంది. ఈ మేరకు టీపీసీసీ ఘన ఏర్పాట్లు చేసింది. గూడబెల్లూరులో అల్పాహారం అనంతరం మధ్యాహ్నం నుండి యాత్ర దీపావళి నిమిత్తం మూడు రోజులపాటు అంటే 26వ తేది వరకు బ్రేక్ తీసుకోనుంది. అనంతరం 27 తేదీ ఉదయం గూడబెల్లూరులో ప్రారంభం కానున్న యాత్ర మక్తల్ చేరుకుని తెలంగాణాలో సుదీర్ఘంగా 16 రోజులపాటు 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 375 కిలోమీటర్ల మేరకు కొనసాగుతుంది. అంతరం నవంబర్ 7న మహారాష్ట్రలో ప్రవేశించనుంది. 16 రోజుల యాత్రలో దీపావళికి మూడు రోజులు, నవంబర్ 4న ఒకరోజు సాధారణ బ్రేక్ తీసుకోనున్న యాత్ర తదనంతరం 12 రోజులపాటు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. కొన్ని ప్రాంతాల్లో కార్నిర్ మీటింగులు, మరికొన్ని ప్రాంతాల్లో ఉదయపు అల్పాహారం, మరికొన్ని ప్రాంతాలలో నైట్ హాల్ట్ లు చేస్తూ రాహుల్ గాంధీ రోజుకు 20 నుంచి 25 కిలోమీటర్ల మేరకు పాదయాత్రతో ముందుకు సాగనున్నారు. ఇక హైదరాబాద్ నగరంలోని బోయినపల్లిలో ఒకరోజు నైట్ హాల్ట్ చేయనుండగా నెక్లెస్ రోడ్ లో కార్నర్ మీటింగ్ లో రాహుల్ పాల్గొని ప్రసంగించనున్నారు.
Sat, 22 Oct 202208:38 AM IST
సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.... మునుగోడు ఉప ఎన్నిక నాటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చర్చ అంతా ఆయన చుట్టే నడుస్తోంది. తాజాగానే ఓ ఆడియో బయటికి రావటం ఆ పార్టీలో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు పార్టీ నేతలు... మునుగోడులో విస్తృత్తంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.... ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కోమటిరెడ్డి... మునుగోడు ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Sat, 22 Oct 202206:48 AM IST
పవన్కు మహిళా కమిషన్ నోటీసులు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మహిళా కమిషన్ నోటీసులు జారి చేసింది. మూడు పెళ్లిళ్లపై మంగళగిరిలో పవన్ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటిని ఉపసంహరించుకోవాలని కోరింది.
Sat, 22 Oct 202205:31 AM IST
మధ్య ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 14 మంది మృతి చెందారు. మధ్యప్రదేశ్లోని రేవా ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలో భారీ ప్రాణ నష్టం వాటిల్లింది. ప్రమాద మృతులంతా కూలీలుగా గుర్తించారు. దీపావళి పండగకు స్వగ్రమాలకు వెళ్తుండగా ఘటన జరిగింది.
Sat, 22 Oct 202205:31 AM IST
బెయిల్పై విడుదల కానున్న జనసేన నేతలు
విశాఖ విమానాశ్రయంలో మంత్రులపై దాడికి పాల్పడ్డారనే అభియోగాలపై అరెస్టైన నిందితులు నేడు విడుదల కానున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన జనసేన నాయకులకు బెయిల్ మంజూరు కావడంతో నేడు బెయిల్పై విడుదల కానున్నారు. ఎయిర్పోర్టు ఘటనలో అరెస్టైన జనసేన నేతలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత నిందితుల్ని చేయనున్నారు.
Sat, 22 Oct 202205:31 AM IST
పోలీసుల అదుపులో ఎమ్మెల్సీ పిఏ
వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ అహ్మద్ పీఏను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీఏ గోపికృష్ణను రహస్య ప్రాంతంలో ప్రశ్నిస్తున్నారు. ఈనెల 8న చౌళూరులో దారుణహత్యకు గురైన రామకృష్ణారెడ్డి హత్యకేసులో గోపికృష్ణ ప్రమేయం ఉందంటూ కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేయకుండా గోపికృష్ణకు హిందూపురం పోలీసులు రక్షణ కల్పించారని ఆరోపణలు వచ్చాయి. నిందితులతో ఎమ్మెల్సీ పీఏ గోపికృష్ణ మాట్లాడిన ఆడియోను వెలుగులోకి రావడంతో పోలీసులు స్పందించారు. గోపికృష్ణను అర్థరాత్రి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Sat, 22 Oct 202205:31 AM IST
యువతిపై అత్యాచార యత్నం
కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్లో యువతిపై అత్యాచారయత్నం జరిగింది. ప్రేమికుల జంట నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లడం గమనించిన గంజాయి బ్యాచ్, ఆటోలో వెనుక నుంచి వెళ్లి యువకుడిని తాళ్లతో బంధించారు. యువతిపై అత్యాచారానికి యత్నించగా గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు రావడంతో నిందితులు పరారయ్యారు. గంజాయి బ్యాచ్లో ఒకరిని పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు, నిందితుల ఆటోలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. బాధిత యువతీ యువకులను ఆసుపత్రికి తరలించారు.
Sat, 22 Oct 202205:31 AM IST
41 వ రోజు నిలిచిన పాదయాత్ర…
అమరావతి రైతుల పాదయాత్ర 41వ రోజు నిలిచిపోయింది. పోలీసు ఆంక్షల నేపథ్యంలో యాత్రకు బ్రేక్ పడింది. కేవలం పోలీసులు అనుమతించిన వారిని మాత్రమే యాత్రకు అనుమతిస్తామని తేల్చి చెప్పడం ఉద్రిక్తతకు దారి తీసింది. కేవలం 600మంది మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని, ఇతరులకు ఎవరు యాత్రలో పాల్గొనరాదని చెప్పడంతో రైతులు యాత్రకు బ్రేక్ వేశారు. పోలీసుల తీరుపై హైకోర్టును ఆశ్రయించాలని రైతులు నిర్ణయించారు. న్యాయస్థానం ఉత్తర్వులతోనే యాత్రను కొనసాగిస్తామని ప్రకటించారు.