T20I World Cup: టీ20 ప్రపంచకప్ జట్టులో ఆ దిగ్గజ ఆటగాడు ఉండాలి: మాజీ కోచ్
రాబోయే టీ20 ప్రపంచకప్ జట్టులో భారత్ తరఫున అశ్విన్ను ఆడించాలని టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ తెలిపారు. లెగ్ స్పిన్నర్ కూడా ఒకరు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
మరికొన్ని రోజుల్లో 2022 టీ20 ప్రపంచకప్ సమరం రానుంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరులో ఈ టోర్నీ జరగనుంది. దీంతో ప్రతి జట్టు ఇప్పటికే అందుకు తగినట్లుగా సన్నాహాలు ప్రారంభించింది. భారత్ కూడా ఇప్పటికే ఐపీఎల్ మొదలుకుని చాలా సిరీస్లను టీ20 ఫార్మాట్లోనే ఆడుతోంది. భారత క్రికెటర్లపై ప్రయోగాలు చేస్తూ రోహిత్ శర్మ ముందుకు వెళ్తున్నారు. దీంతో జట్టులో పోటీ తీవ్రంగా నెలకొంది. ఇలాంటి సమయంలో పలువురు మాజీలు సైతం కొంతమంది పేర్లను సూచిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్.. టీ20 ప్రపంచకప్ జట్టు ఆ దిగ్గజ క్రికెటర్ తప్పకుండా ఉండాలని సూచించారు. ఇంతకీ ఆ దిగ్గజ ఆటగాడు మరెవరో కాదు రవిచంద్రన్ అశ్విన్.
"ప్రపంచకప్ జట్టులో భువి, షమీని తీసుకుంటే వారి చేత రెండు సార్లు బౌలింగ్ చేయించవచ్చు. ఇప్పుడు హార్దిక్ పాండ్య కూడా వారికి తోడుగా ఉన్నాడు. రవీంద్ర జడేజా ఆల్రౌండర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఐదు, ఆరో బౌలర్లను కవర్ చేయాలి. లెగ్ స్పిన్నర్ ఉంచితే మంచిది. చాహల్ అందుకు మంచి ఆప్షన్. నా దృష్టిలో ఇది మంచి బౌలింగ్ కలయిక. ఇక ఆరో బౌలర్గా అశ్విన్ను తీసుకోవాలి. కానీ అతడిని తీసుకుంటే చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి." అని శ్రీధర్ స్పష్టం చేశారు.
టీ20 ప్రపంచకప్లో అశ్విన్ను తీసుకోవడంపై చాలా మంది ఇష్టపూర్వకంగా లేదు. వెస్టిండీస్-భారత్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్లోనే అతడిని తీసుకోవడంపై పలువురు మాజీలు చురకలంటించారు. విండీస్తో సిరీస్కు అశ్విన్ను తీసుకోవడంపై తాను కన్ఫ్యూజ్ అయ్యానని క్రిష్ణమాచారి శ్రీకాంత్ తెలిపారు. అతడు 8 నెలలుగా టీ20 క్రికెట్కు దూరంగా ఉన్నాడని స్పష్టం చేశారు.
ప్రస్తుతం విండీస్తో జరుగుతున్న టీ20 సిరీస్లో టీమిండియా 2-1 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. అనంతరం జింబాబ్వే సిరీస్, ఆసియాకప్ ఆడనుంది టీమిండియా. వీటన్నింటిలో విజయం సాధించి టీ20 ప్రపంచకప్నకు పూర్తిగా సన్నద్ధమవుతోంది.
టాపిక్