Joe Root: విరాట్ కోహ్లి రికార్డు బ్రేక్ చేసిన జో రూట్
Joe Root: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి చెందిన మరో రికార్డు బ్రేక్ అయింది. ఈసారి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ అతని రికార్డు బ్రేక్ చేశాడు.
బర్మింగ్హామ్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ ఏడాదిన్నర కాలంగా టాప్ ఫామ్లో ఉన్నాడు. 2021 జనవరి నుంచి ఇప్పటి వరకూ అతడు టెస్ట్ క్రికెట్లో ఏకంగా 10 సెంచరీలు చేశాడు. ఇదే సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఏ ఫార్మాట్లోనూ ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. రూట్ మాత్రం ఇంగ్లండ్ టీమ్ను తన బ్యాటింగ్తో ఎన్నోసార్లు ఆదుకున్నాడు.
ఇక ఇప్పుడు విరాట్ కోహ్లికి చెందిన ఓ పెద్ద రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. ఇండియాతో జరుగుతున్న చివరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 31 రన్స్ చేసిన రూట్.. రెండో ఇన్నింగ్స్లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 75 రన్స్తో అజేయంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే 2016 నుంచి విరాట్ పేరిట ఉన్న రికార్డును రూట్ అధిగమించాడు.
ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన ఒక సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రూట్ నిలిచాడు. 2016లో ఇంగ్లండ్తో సిరీస్లో విరాట్ 655 రన్స్ చేయగా.. ఇప్పుడు రూట్ 671 రన్స్ (నాలుగో రోజు వరకు)తో దానిని బ్రేక్ చేశాడు. గతేడాది జరిగిన నాలుగు టెస్టుల్లో రూట్ 564 రన్స్ చేయగా.. ఇప్పుడు చివరి టెస్ట్లో ఇప్పటి వరకూ 107 రన్స్ చేశాడు. ఈ ఐదు టెస్ట్ల సిరీస్ ఇప్పటికే 3 సెంచరీలు చేసిన రూట్.. చివరి రోజు మరో సెంచరీకి 25 రన్స్ దూరంలో ఉన్నాడు.
2016 సిరీస్లో విరాట్ కోహ్లి 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో 655 రన్స్ చేశాడు. ఇప్పుడు ఇంగ్లండ్ గడ్డపై 15 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ గెలవాలని అనుకున్న ఇండియన్ టీమ్కు రూట్ అడ్డుగోడలా నిలిచాడు. చేజింగ్లో కష్టాల్లో ఉన్న ఆ టీమ్ను బెయిర్స్టోతో కలిసి ఆదుకోవడమే కాదు.. విజయంవైపు నడిపిస్తున్నాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలిస్తే ఐదు టెస్ట్ల సిరీస్ 2-2తో సమమవుతుంది.