Hardik slams pitch curators: ఇవేం పిచ్లు.. మరీ చెత్తగా ఉన్నాయి: క్యూరేటర్లపై హార్దిక్ సీరియస్
Hardik slams pitch curators: ఇవేం పిచ్లు.. మరీ చెత్తగా ఉన్నాయంటూ న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ మ్యాచ్ లకు పిచ్ లు తయారు చేసిన క్యూరేటర్లపై టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా సీరియస్ అయ్యాడు. రెండో టీ20లో ఇండియా 100 టార్గెట్ చేజ్ చేయడానికి కూడా తంటాలు పడిన విషయం తెలిసిందే.
Hardik slams pitch curators: అటు న్యూజిలాండ్, ఇటు ఇండియన్ టీమ్స్ లో భారీ హిట్టర్లు ఉన్నారు. అయినా రెండో టీ20లో కివీస్ కేవలం 99 రన్స్ చేయగా.. ఆ 100 టార్గెట్ చేజ్ చేయడానికి కూడా టీమిండియా తంటాలు పడింది. సూర్యకుమార్ లాంటి టీ20 స్పెషలిస్ట్ కూడా ఒక్కో పరుగు కోసం కిందామీదా పడ్డాడు. చివరి వరకూ క్రీజులో ఉండి 26 రన్స్ చేసినా ఒకే ఒక్క బౌండరీ మాత్రం బాదగలిగాడు.
అటు కెప్టెన్ హార్దిక్ పరిస్థితి కూడా అంతే. అసలు టీ20లకు ఏమాత్రం సరిపోని పిచ్ ను లక్నోలోని వాజ్పేయి స్టేడియం క్యూరేటర్ తయారు చేశాడు. దీనిపై మ్యాచ్ తర్వాత హార్దిక్ పాండ్యా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచే కాదు తొలి మ్యాచ్ పిచ్ కూడా అలాగే ఉందని, తాము ఆడబోయే స్టేడియాల్లో పిచ్ లను చాలా ముందుగానే తయారు చేసేలా చూడాలని అన్నాడు.
"నిజాయతీగా చెప్పాలంటే ఈ పిచ్ చాలా దారుణంగా ఉంది. ఈ సిరీస్ లో మేము ఆడిన రెండు మ్యాచ్ లలోనూ అదే పరిస్థితి. క్లిష్టమైన వికెట్లు అయితే ఫర్వాలేదు. ఆ సవాలుకు సిద్ధం. కానీ ఈ రెండు పిచ్ లు అసలు టీ20ల కోసం చేసినవి కావు. మేము ఆడబోయే గ్రౌండ్లలో పిచ్ లను చాలా ముందుగానే సిద్ధం చేసేలా క్యూరేటర్లు చూస్తే బాగుంటుంది" అని హార్దిక్ చెప్పాడు.
లక్నోలోని పిచ్ పూర్తిగా బౌలర్లకు అనుకూలించింది. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ లో ఆడటం చాలా కష్టంగా అనిపించింది. రెండు జట్లలోని హిట్టర్లు కూడా ఈ పిచ్ పై బౌలర్లకు తలవంచాల్సి వచ్చింది. ఇండియా తరఫున కుల్దీప్, చహల్, అర్ష్దీప్, సుందర్, పాండ్యా, హుడా సమష్టిగా రాణించడంతో న్యూజిలాండ్ కేవలం 99 రన్స్ మాత్రమే చేయగలిగింది. అయితే ఈ పిచ్ పై 120 చేసినా గెలిచే ఛాన్స్ ఉంటుందని పాండ్యా అన్నాడు.
"ఇక్కడ 120 కూడా గెలిచే లక్ష్యమే. మా బౌలర్లు తమ ప్రణాళిక ప్రకారం బౌలింగ్ చేసి బ్యాటర్లు స్ట్రైక్ రొటేట్ చేయకుండా చూశారు. స్పిన్నర్లను మార్చిమార్చి బౌలింగ్ చేయించాం. పొగమంచు ప్రభావం పెద్దగా లేదు. వాళ్లు మా కంటే బాగా స్పిన్ చేయగలిగారు. కానీ పిచ్ మాత్రం నిజంగా షాక్ కు గురి చేసింది" అని హార్దిక్ స్పష్టం చేశాడు. మూడు టీ20ల సిరీస్ ను టీమిండియా 1-1తో సమం చేయగా.. మూడో టీ20 బుధవారం (ఫిబ్రవరి 1) అహ్మదాబాద్ లో జరగనుంది.
సంబంధిత కథనం