Bumrah Ruled out of ODI series: బుమ్రా రాక మరింత ఆలస్యం.. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు దూరం-bumrah ruled out of odi series against sri lanka ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Bumrah Ruled Out Of Odi Series Against Sri Lanka

Bumrah Ruled out of ODI series: బుమ్రా రాక మరింత ఆలస్యం.. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు దూరం

Hari Prasad S HT Telugu
Jan 09, 2023 02:47 PM IST

Bumrah Ruled out of ODI series: బుమ్రా రాక మరింత ఆలస్యం కానుంది. అతడు శ్రీలంకతో వన్డే సిరీస్‌కు దూరమైనట్లు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది. ఈ మధ్యే అతన్ని టీమ్‌లోకి తీసుకున్న బీసీసీఐ అంతలోనే తన నిర్ణయాన్ని మార్చుకుంది.

జస్ప్రీత్ బుమ్రా
జస్ప్రీత్ బుమ్రా (AFP)

Bumrah Ruled out of ODI series: శ్రీలంకపై టీ20 సిరీస్‌ గెలిచి ఊపు మీదున్న టీమిండియాకు ఓ బ్యాడ్‌న్యూస్‌. వన్డే సిరీస్‌కు తిరిగి వస్తాడనుకున్న స్టార్‌ పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా.. ఇప్పుడు దూరమైనట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయని పీటీఐ తెలిపింది. అతడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

"జస్‌ప్రీత్‌ బుమ్రా శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్‌కు దూరం కావచ్చు. తొలి వన్డే కోసం అతడు టీమ్‌తో కలిసి వెళ్లడం లేదు. బీసీసీఐ కూడా అతన్ని తొందరపడి ఫీల్డ్‌లోకి తీసుకురావాలని అనుకోవడం లేదు. రానున్న రోజుల్లో అతడు ఓ ప్రధాన సిరీస్‌లో ఆడాల్సి ఉంది" అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం (జనవరి 10) నుంచి శ్రీలంకతో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.

ఈ వన్డే సిరీస్‌ కోసం బుమ్రాను టీమ్‌లోకి తీసుకుంటున్నట్లు జనవరి 3న బీసీసీఐ వెల్లడించింది. అతడు నేషనల్‌ క్రికెట్‌ అకాడెమీలో రీహ్యాబిలిటేషన్‌లో పాల్గొన్నాడని, ఫిట్‌గా ఉన్నట్లు ఎన్సీఏ కూడా చెప్పినట్లు బోర్డు తెలిపింది. దీంతో అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు అందరూ భావించారు. అయితే ఇప్పుడు సిరీస్‌ ప్రారంభానికి ఒక రోజు ముందు అతడు ఆడటం లేదని తెలుస్తోంది.

గతేడాది సెప్టెంబర్‌ నుంచి బుమ్రా క్రికెట్‌ ఆడలేదు. అతడు వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. ఈ గాయంతోనే టీ20వరల్డ్‌కపకు కూడా దూరమయ్యాడు. మంగళవారం గువాహటిలో శ్రీలంకతో ఇండియా తొలి వన్డే ఆడనుంది. బుమ్రా లేకపోయినా.. ఈ సిరీస్‌కు మిగతా సీనియర్లు రోహిత్‌, విరాట్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ రానున్నారు. జనవరి 10, 12, 15 తేదీల్లో గువాహటి, కోల్‌కతా, త్రివేండ్రంలలో మూడు వన్డేలు జరగనున్నాయి.

ఆస్ట్రేలియాతో వచ్చే నెల 9 నుంచి ఇండియా నాలుగు టెస్టుల సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే ఇండియాకు ఈ సిరీస్ కీలకం కానుంది. దీంతో ఆ సిరీస్ కు బుమ్రా తీసుకురావాలన్న ఉద్దేశంతో బీసీసీఐ ఇప్పుడు శ్రీలంకతో వన్డే సిరీస్ కు అతన్ని దూరం పెట్టినట్లు తెలుస్తోంది.

WhatsApp channel

సంబంధిత కథనం