Navaratri 5th Day : శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో అమ్మవారి దర్శనం
Navaratri Lalitha Tripura Sundari Devi Darshanam : నవరాత్రుల్లో భాగంగా.. అమ్మవారు ఐదవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. నవరాత్రుల్లో ఐదవ రోజు చాలా విశేషమైనదని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. అయితే దేవీ నవరాత్రులో ప్రాంతాలను బట్టి అమ్మవారిని అలంకరిస్తారని పేర్కొన్నారు.
Navaratri Lalitha Tripura Sundari Devi Darshanam : దేవీ నవరాత్రులలో ఐదవ రోజు ఎంతో ప్రాధాన్యత ఉన్న రోజు. ఈ రోజు అమ్మవారి అలంకరణ పేరు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణ. కొన్ని ప్రాంతాలలో అమ్మవారిని ఈ రోజు స్కంధ మాతగా పూజిస్తారు. లలితాదేవిని కళలకు, సౌభాగ్యానికి ప్రతీకగా పిలుస్తారు. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి ఆశీస్సులు ఉన్నట్లయితే సకల దేవతల ఆశీస్సులు పొందునట్లుగా భావిస్తారు.
ఆశ్వయుజ మాస శుక్ల పక్ష పంచమి రోజున కొన్ని ప్రాంతాలలో అమ్మవారిని స్కంధమాతగా పూజిస్తారు. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని నారింజపండు రంగు వస్త్రముతో అలంకరిస్తారు. అమ్మవారికి పెరుగు అన్నము, గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు.
దేవీ భాగవతం ప్రకారం..
పూర్వం మధుకైటంబులు అనే రాక్షసులను వధించటానికి బ్రహ్మదేవుని కోరికపై మహామాయ విష్ణువుని నిద్రలేపడం, యోగనిద్ర నుంచి లేచిన విష్ణువు కొన్ని వేల సంవత్సరాలు ఆ రాక్షసులతో యుద్ధం చేశారు. అయినా విష్ణువు వారిని జయించలేకపోయారు. ఆ పరిస్థితిని గమనించిన మహాదేవి ఆ మధుకైటంబు రాక్షసులను మోహపూరితులను చేసింది. దాంతో వారు మహావిష్ణువును మెచ్చుకుని నీకు ఏ వరం కావాలి అని అడిగారు. శ్రీహరి వారి మరణాన్ని వరంగా అడుగుతారు. దానితో ఆ రాక్షసులు శ్రీహరి చేతిలో తమ మరణం తధ్యమని గ్రహించి తమను నీరు లేనిచోట చంపమని కోరుతారు.
అంతటితో శ్రీ మహావిష్ణువు వారిని పైకెత్తి భూఅంతరాలలో సంహరించు సమయంలో.. మహామాయ పదితలలతో, పది కాళ్లతో, నల్లని రూపుతో మహాకాళిగా ఆవిర్భవించి శ్రీ మహావిష్ణువుకు సహాయపడింది. ఈ విధముగా మహా మాయ అయిన అమ్మవారు.. మహావిష్ణువుతో కలిసి రాక్షస సంహారం చేశారు. కంస సంహారమునకు సహాయపడుటకై నందా అనే పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణుడికి సహాయపడ్డారు అమ్మవారు. సింహవాహినిగా మహిసాసురుని సరస్వతీ రూపిణిగా సుబ, నుసుంబులను ఛండ ముండులను సంహరించిన ఛాముండి, లోకాలను కరువునుంచి రక్షించినందుకు శాఖాంబరి, దుర్గుడు అనే రాక్షసుడిని సంహరించినందుకు దుర్గగా ఇలా నవరూపాలను అమ్మవారు అవతారాలుగా చెప్తారు.
సంబంధిత కథనం