RBI may hike lending rates: ఇంకా పెరగనున్న వడ్డీ రేట్లు.. డీబీఎస్ అంచనా
ద్రవ్యోల్భణాన్ని తగ్గించేందుకు ఏప్రిల్ మాసంలో ఆర్బీఐ మరోమారు వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని డీబీఎస్ అంచనా వేసింది.
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ వచ్చే నెల ద్వైమాసిక మానిటరీ పాలసీ విధాన సమావేశంలో బెంచ్ మార్క్ లెండింగ్ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని డిబిఎస్ గ్రూప్ రీసెర్చ్ సోమవారం తెలిపింది.
పెరుగుతున్న ధరలను అదుపు చేసేందుకు గత ఏడాది మే నుంచి ఆర్బీఐ వడ్డీ రేట్లను 250 బేసిస్ పాయింట్లు పెంచింది. ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్ల పెంపు తో బెంచ్ మార్క్ పాలసీ రేటును 6.50 శాతానికి తీసుకువెళ్లింది.
'వృద్ధి కోలుకోవడం, ద్రవ్యోల్బణం' అనే అంశంపై ఆన్లైన్ సెషన్లో డిబిఎస్ గ్రూప్ రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్సీ, సీనియర్ ఎకనామిస్ట్ రాధికా రావు మాట్లాడారు. ఏప్రిల్లో ఆర్బిఐ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచుతుందని, రిటైల్ ద్రవ్యోల్బణం ఇంకా ఎక్కువగా ఉన్నందున పెంపు కొనసాగించవచ్చని అన్నారు. గత ఏడాది డిసెంబర్లో 5.72 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 6.52 శాతానికి పెరిగింది.
అయితే సరఫరా-వైపు పరిమితుల వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని ద్రవ్య విధానం ద్వారా మాత్రమే పరిష్కరించలేమని, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ఇది సరిపోదని రాధికా రావు అన్నారు.
‘వ్యవసాయ ఉత్పత్తికి వాతావరణ పరిస్థితులు ముఖ్యమైనవి. రాబోయే 3 నెలల్లో అధిక ఉష్ణోగ్రతలను చూడవచ్చని స్థానిక వాతావరణ సంస్థ తెలిపింది. జూన్-జూలైలో రాబోయే రుతుపవనాలు కీలకమైన కాలం. వాతావరణం ద్రవ్యోల్బణానికి ముఖ్యమైనది. వ్యవసాయోత్పత్తి రంగం జనాభాలో 45 శాతం మందికి ఉపాధిని కల్పిస్తోంది’ అని రావు చెప్పారు. ద్రవ్యోల్బణం ఇంకా లక్ష్యంలో ఎక్కువ స్థాయిలోనే ఉందని ఆమె అన్నారు.
‘ఆహార విభాగంలో సరఫరా కొరత ఇంకా ఉంటుందని మేం భావిస్తున్నాం. ఏప్రిల్లో జరగబోయే సమావేశంలో మరో 25 బేసిస్ పాయింట్ల పెంపు ఉంటుందని మేం భావిస్తున్నాం. సరఫరా కొరతను ద్రవ్య విధానం ద్వారా మాత్రమే పరిష్కరించలేదు..’ అని పేర్కొన్నారు. ‘కొంత ఆర్థిక మద్దతుకు పాలనా చర్యల పరంగా ప్రభుత్వం నుండి మద్దతును చూడాలి’ అని రావు జోడించారు.
ఆర్బీఐ తదుపరి ద్రవ్య విధాన సమావేశం ఏప్రిల్ 6న జరగనుంది. ప్రధానంగా అధిక బేస్ కారణంగా డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి క్షీణించిందని రావు చెప్పారు. అయితే, పీఎంఐ డేటా, ఆటో విక్రయాలు, జీఎస్టీ వసూళ్లు 2023లో ఉత్సాహాన్ని చూపుతున్నాయి. కానీ పొదుపు తగ్గింది.
భారతదేశ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి అక్టోబర్-డిసెంబర్ కాలంలో మూడు త్రైమాసిక కనిష్ట స్థాయి 4.4 శాతానికి తగ్గింది. ప్రధానంగా తయారీ రంగంలో సంకోచం, తక్కువ ప్రైవేట్ వినియోగ వ్యయం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది.
భారత ఆర్థిక వ్యవస్థ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 6.3 శాతం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 13.2 శాతం వృద్ధి చెందింది.