Rohit Sharma: ఇంగ్లాండ్ గడ్డపై రోహిత్ శర్మ అరుదైన రికార్డు
రోహిత్ శర్మ(rohit sharma) దూకుడైన ఆటతో ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేల్లో టీమ్ ఇండియా (team india) అలవోకగా విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ద్వారా ఇంగ్లాండ్ గడ్డపై రోహిత్ శర్మ అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఆ రికార్డు ఏదంటే...
తొలి వన్డేలో 58 బాల్స్ లోనే 76 రన్స్ చేసి ధనాధన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అతడి బ్యాటింగ్ జోరుతో ఇంగ్లాండ్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది భారత్. టీ20 తరహాలో సిక్సర్లు, ఫోర్లతో ఇంగ్లాండ్ బౌలర్లపై రోహిత్ శర్మ విరుచుకుపడ్డాడు. అతడి ఇన్నింగ్స్ లో ఐదు సిక్సర్లు, ఆరు ఫోర్లు ఉండటం గమనార్హం. ఈ హాఫ్ సెంచరీతో వన్డేల్లో ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన విదేశీ క్రికెటర్ గా రోహిత్ శర్మ అరుదైన రికార్డును నెలకొల్పాడు.
గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ పేరు మీద ఉంది. ఇంగ్లాండ్ గడ్డపై విలియమ్సన్ 1393 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతడి రికార్డును తొలి వన్డే ద్వారా రోహిత్ అధిగమించాడు. 25 ఇన్నింగ్స్ లలో రోహిత్ శర్మ 1411 రన్స్ చేశాడు. వన్డేల్లో ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక రన్స్ చేసిన క్రికెటర్లలో రోహిత్ శర్మ, కేన్ విలియమ్సన్ తర్వాత మూడో స్థానంలో రికీ పాటింగ్(1345 రన్స్), నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి (virat kohli)(1316 రన్స్)ఉండగా వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్(chris gayle)(1258) ఐదో స్థానంలో నిలిచాడు.
అంతేకాకుండా ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఐదు వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న ఓపెనింగ్ జోడిగా నిలిచింది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ను 2 2 తో సమంగా ముగించిన టీమ్ ఇండియా టీ20 సిరీస్ ను 2 1 తేడాతో కైవసం చేసుకున్నది. మూడు వన్డేల సిరీస్ లో 1 0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. నేడు రెండో వన్డే జరుగనున్నది.
సంబంధిత కథనం