Pant on Urvashi: నన్ను వదిలెయ్ అక్కా.. ఇంకెన్ని అబద్ధాలు చెబుతావ్.. బాలీవుడ్ నటిపై పంత్ గరంగరం
Pant on Urvashi: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టి డిలీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాపై అతడు ఆ డిలీట్ చేసిన స్టోరీలో గరంగరమయ్యాడు.
ఇండియన్ టీమ్ వికెట్ రిషబ్ పంత్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టి డిలీట్ చేశాడని చెబుతున్న ఓ స్క్రీన్షాట్ వైరల్గా మారింది. ఆ స్టోరీ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా గురించేనని కూడా నెటిజన్లు ఫిక్సయ్యారు. ఈ స్టోరీ పెట్టి డిలీట్ చేయడానికి పంత్కు 10 నిమిషాలు పట్టింది. ఆలోపే స్క్రీన్షాట్లు తీసుకున్న నెటిజన్లు దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించారు.
అందులో ఏముందంటే.. "పాపులారిటీ కోసం, హెడ్లైన్స్లో నిలవడం కోసం కొందరు వ్యక్తులు ఇంటర్వ్యూల్లో అబద్ధాలు చెప్పడం చూస్తుంటే నవ్వొస్తుంది. కీర్తి ప్రతిష్టల కోసం కొందరు ఇంతలా పరితపించడం చూస్తుంటే జాలేస్తుంది. వాళ్లపై దేవుడు దయ చూపాలి. నన్ను వదిలెయ్ అక్కా, అబద్ధాలకు కూడా ఓ లిమిట్ ఉంటుంది" అని పంత్ ఆ స్టోరీలో రాశాడు.
ఈ మధ్యే ఊర్వశి రౌతేలా ఇచ్చిన ఇంటర్వ్యూపైనే పంత్ ఇలా రియాక్ట్ అయ్యాడని నెటిజన్లు చెబుతున్నారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆర్పీ అనే వ్యక్తి తనను కలవడానికి వచ్చాడని, తాను అలసిపోయి పడుకోవడంతో గంటల తరబడి వేచి చూశాడని చెప్పింది. ఆ ఆర్పీ ఎవరు అని అడిగితే.. ఆ వ్యక్తి మొత్తం పేరు తాను చెప్పనని ఊర్వశి అన్నది. చివరికి తాను లేచిన తర్వాత చూస్తే ఎన్నో మిస్డ్ కాల్స్ ఉన్నాయని కూడా ఊర్వశి చెప్పింది.
ఆమె చేసిన ఈ కామెంట్స్పైనే పంత్ అలా సీరియస్గా రియాక్ట్ అయినట్లు భావిస్తున్నారు. నిజానికి పంత్, ఊర్వశికి లింకు పెడుతూ వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఈ ఇద్దరూ కలిసి తిరుగుతున్నారని వార్తలు వచ్చాయి. అటు పంత్ ఈ మధ్య వెస్టిండీస్ టూర్ నుంచి వచ్చాడు. ఇప్పుడు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ కోసం సిద్ధమవుతున్నాడు.