PV Sindhu: కామన్వెల్త్ గేమ్స్ సింగిల్స్ గోల్డ్ మెడల్ గెలిచిన పీవీ సింధు
PV Sindhu: కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్ గోల్డ్ మెడల్ గెలిచింది స్టార్ షట్లర్ పీవీ సింధు. ఈ గేమ్స్లో ఆమె సింగిల్స్ గోల్డ్ మెడల్ గెలవడం ఇదే తొలిసారి.
బర్మింగ్హామ్: కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఇండియా గోల్డ్ మెడల్స్ సంఖ్య 19కి చేరింది. బ్యాడ్మింటన్ వుమెన్ సింగిల్స్లో పీవీ సింధు గోల్డ్ గెలిచింది. ఆమె ఫైనల్లో కెనడాకు చెందిన మిషెలీ లీపై 21-15, 21-13 తేడాతో సులువుగా గెలిచింది. కామన్వెల్త్ గేమ్స్ సింగిల్స్లో సింధు గోల్డ్ గెలవడం ఇదే తొలిసారి. గత గేమ్స్లో మిక్స్డ్ టీమ్ గోల్డ్ గెలిచిన ఆమె.. సింగిల్స్లో సిల్వర్తో సరిపెట్టుకుంది.
రెండుసార్లు ఒలింపిక్ మెడలిస్ట్ అయిన సింధు.. ఈసారి మాత్రం తన కలను చెప్పి మరీ నెరవేర్చుకుంది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సిల్వర్ రావడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె.. సింగిల్స్లో కచ్చితంగా గోల్డ్ గెలుస్తానని చెప్పింది. అన్నట్లే ఆమె మొదటి నుంచి ప్రత్యర్థులను చిత్తు చేస్తూ చివరికి ఫైనల్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
ఫైనల్లోనూ ప్రత్యర్థి మిషెలీపై మొదటి నుంచీ ఆధిపత్యం చెలాయించింది. ఏ సందర్భంలోనూ ఆమెకు లీడ్ కోల్పోలేదు. తొలి గేమ్ ను 21-15తో గెలిచిన సింధు.. రెండో గేమ్ లోనూ మొదటి నుంచీ లీడ్ కొనసాగించింది. గేమ్ ఇంటర్వెల్ సమయానికి 11-6 తో ఆధిక్యంలో ఉంది.
బ్రేక్ తర్వాత ప్రత్యర్థి లీ దూకుడుగా ఆడింది. ఈ ఇద్దరూ ఒక సందర్భంలో ఒక పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించారు. ఒకే ర్యాలీలో ఏకంగా 57 షాట్స్ ఆడారు. ఆ తర్వాత పాయింట్ సింధు సొంతమైంది.
ఈ విజయంతో కామన్వెల్త్ గేమ్స్లో ఆమె మెడల్స్ హ్యాట్రిక్ పూర్తి చేసింది. 2014లో బ్రాంజ్, 2018లో సిల్వర్, ఇప్పుడు 2022లో గోల్డ్ మెడల్ గెలవడం విశేషం. ఇప్పటికే ఒలింపిక్స్లో బ్రాంజ్, సిల్వర్ మెడల్స్ గెలిచిన సింధు.. కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్తో మరో లెవల్కు వెళ్లింది.