Pro Kabaddi League Winner: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10 విజేత పుణెరి పల్టన్.. ఫైనల్లో హర్యానా చిత్తు
Pro Kabaddi League Winner: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్ 10 విజేతగా పుణెరి పల్టన్స్ టీమ్ నిలిచింది. శుక్రవారం (మార్చి 1) రాత్రి జరిగిన ఫైనల్లో హర్యానా స్టీలర్స్ ను చిత్తు చేసి ఆ టీమ్ తొలిసారి టైటిల్ సాధించింది.
Pro Kabaddi League Winner: రెండున్నర నెలల పాటు కబడ్డీ ప్రేమికులను అలరించిన ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) సీజన్ 10 ముగిసింది. శుక్రవారం (మార్చి 1) జరిగిన ఫైనల్లో పుణెరి పల్టన్ టీమ్ తొలిసారి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఫైనల్లో హర్యానా స్టీలర్స్ ను ఆ టీమ్ 28-25 తేడాతో చిత్తు చేసింది. ఈ ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న ఇండోర్ స్టేడియంలో జరిగింది.
పీకేఎల్ సీజన్ 10 విన్నర్
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10 ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తొలి టైటిల్ కోసం పుణెరి పల్టన్, హర్యానా స్టీలర్స్ మధ్య గట్టి పోటీయే నడిచింది. చివరికి పుణెరి ఈ మ్యాచ్ లో పైచేయి సాధించింది. మ్యాచ్ మొదటి నుంచీ హర్యానాపై ఆధిక్యం కొనసాగిస్తూ వచ్చిన పుణెరి పల్టన్.. చివరికి టైటిల్ సొంతం చేసుకుంది. కేవలం మూడు పాయింట్ల తేడాతో పుణెరి గెలిచింది.
ఈ ఫైనల్లో పుణెరి ప్లేయర్ పంకజ్ 9 రెయిడ్ పాయింట్లు సాధించాడు. ఇక మోహిత్ 5, కెప్టెన్ అస్లమ్ 4 పాయింట్లు సాధించారు. ఇక హర్యానా తరఫున శివమ్ పటారే 6 పాయింట్లు తీసుకొచ్చాడు. మ్యాచ్ చివరి నిమిషం వరకూ హర్యానా గట్టిగానే పోరాడినా.. ఫలితం లేకుండా పోయింది.
పీకేఎల్ సీజన్ 10.. 132 మ్యాచ్లు
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10 గతేడాది డిసెంబర్ 2న ప్రారంభమైంది. మొత్తానికి సుమారు 70 రోజులు, 132 మ్యాచ్ ల తర్వాత శుక్రవారం (మార్చి 1) హైదరాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ తో ముగిసింది. ఈ సీజన్ లో మొత్తం 12 టీమ్స్ పాల్గొన్నాయి. ఒక్కో టీమ్ లీగ్ స్టేజ్ లో 22 మ్యాచ్ లు ఆడింది. అందులో 11 సొంతగడ్డపై, 11 మ్యాచ్ లు ప్రత్యర్థుల దగ్గరా ఆడాయి.
ఈసారి తెలుగు టైటన్స్ టీమ్ 22 మ్యాచ్ లలో కేవలం 2 గెలిచి, 19 ఓడిపోయింది. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. మరీ దారుణమైన ప్రదర్శన చేసిన తెలుగు టైటన్స్ టీమ్ తమ కోచ్ శ్రీనివాస్ రెడ్డిపై వేటు వేసింది. కొత్త కోచ్ కేకే హుడాగా నియమితుడయ్యాడు.
పీకేఎల్ సీజన్ 10 ప్రైజ్ మనీ ఇలా..
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) పదో సీజన్ మొత్తం ప్రైజ్ మనీ రూ.8 కోట్లుగా ఉంది. ఐదో సీజన్ నుంచి ప్రతి సీజన్ లోనూ మొత్తం ప్రైజ్ మనీ ఇంతే ఉంటూ వస్తోంది. ఇందులోనే విన్నర్, రన్నరప్ తోపాటు ఆరోస్థానం వరకూ నిలిచిన జట్లు, ప్లేయర్స్, రిఫరీలకు ప్రైజ్ మనీ అందిస్తారు.
విజేత - రూ.3 కోట్లు
రన్నరప్ - రూ1.8 కోట్లు
మూడు, నాలుగు స్థానాలు - ఒక్కొక్కరికి రూ.90 లక్షలు
ఐదు, ఆరు స్థానాలు - ఒక్కో జట్టుకు రూ.45 లక్షలు
అంటే మొత్తం రూ.8 కోట్ల ప్రైజ్ మనీలో రూ.7.5 కోట్లను టాప్ 6 జట్లకు పంచుతారు. ఇక మిగిలిన రూ.50 లక్షలను వ్యక్తిగతంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ప్లేయర్స్, రిఫరీలకు అందజేస్తారు.