రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. ఏ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేదన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆరోపించారు. ఇవాళ పొదిలిలో పర్యటించిన ఆయన... పొగాకు రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ హయాంలో రైతురాజ్యం నడిచిందని గుర్తు చేశారు. ఏ సీజన్ లో జరిగిన నష్టాన్ని.. ఆ సీజన్ ముగిసేలోగా ఆర్బీకేలా ద్వారా చెల్లించాన్నారు. ఈ-క్రాప్ వ్యవస్థను పూర్తిగా నీరుగార్చారని దుయ్యబట్టారు. కల్తీ ఎరువులు, నకిలీ విత్తనాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రైతుల తరఫున ఈ ప్రభుత్వం స్పందించకపోయినా.. కనీస మద్దతు ధర కల్పించకపోయినా వైసీపీ తరపున ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. ఇక జగన్ పొదిలి పర్యటన సందర్భంగా… వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది. అమరావతి మహిళలపై వ్యాఖ్యల(సాక్షి టీవీ డిబేట్) వ్యవహారంపై పలువురు మహిళలు నిరసన వ్యక్తం చేశారు. పీఎస్ఆర్ కాలనీ సమీపంలో నల్లబెలూన్లు, ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. మరోవైపు వైసీపీ శ్రేణలు భారీ సంఖ్యలో ఉండటంతో… కాసేపు పొదిలిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల రంగప్రవేశంతో… పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.