కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందేభారత్ రైళ్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రైళ్లను కేవలం 14 నిమిషాల్లోనే శుభ్రం చేసి, తదుపరి ప్రయాణానికి సిద్ధం చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ‘14 నిమిషాల అద్భుతం’ పేరుతో ఆదివారం నుంచి ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తోన్న 29 వందేభారత్ రైళ్లలో దీనిని అమలు చేయనుంది. జపాన్లోని టోక్యో, ఒసాకా వంటి స్టేషన్లలో బుల్లెట్ రైళ్లను కేవలం ఏడు నిమిషాల్లోనే శుభ్రం చేస్తారు. వాటిని ప్రేరణగా తీసుకుని వందేభారత్ రైళ్ల శుభ్రత సమయ పరిమితిని నిర్దేశించుకున్నారు. ఢిల్లీ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దీనిని స్వచ్ఛత హే సేవ పేరుతో లాంఛనంగా ప్రారంభించారు.